నవతెలంగాణ – హైదరాబాద్: ఇంగ్లాండ్తో జరగనున్న కీలకమైన ఐదు టెస్టుల సిరీస్కు ముందు టీమిండియాకు ఊహించని పరిణామం ఎదురైంది. భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, తన తల్లి అనారోగ్యం కారణంగా ఇంగ్లాండ్ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గంభీర్ తల్లి ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉండటంతో, అతడు ఇప్పట్లో ఇంగ్లాండ్ తిరిగి వెళ్లే అవకాశాలు తక్కువ. ఈ నేపథ్యంలో, ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు టీమిండియా కోచ్ గా క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ను నియమించినట్టు తెలుస్తోంది.
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్… గంభీర్ తిరిగి వచ్చేంత వరకు టీమిండియాకు తాత్కాలిక కోచ్గా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారత అండర్-19 జట్టు పర్యవేక్షణ కోసం లండన్లోనే ఉన్న లక్ష్మణ్, గతంలోనూ పలుమార్లు భారత జట్టుకు తాత్కాలిక కోచ్గా సేవలందించిన అనుభవం ఉంది. అందువల్ల, ఆయన సేవలనే వినియోగించుకోవాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.
జూన్ 20 నుంచి లీడ్స్లో ఇంగ్లాండ్తో భారత్ తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.