Friday, May 30, 2025
E-PAPER
Homeఆటలుముగిసిన లీగ్‌ మ్యాచ్‌లు

ముగిసిన లీగ్‌ మ్యాచ్‌లు

- Advertisement -

పదేండ్ల తర్వాత టాప్‌లోకి పంజాబ్‌, బెంగళూరు
నవతెలంగాణ- స్పోర్ట్స్‌ డెస్క్‌

లక్నో వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-లక్నో సూపర్‌జెయింట్స్‌ జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌తో 2025 సీజన్‌-18 ఐపిఎల్‌ లీగ్‌ మ్యాచ్‌లు ముగిసాయి. మార్చి 26న కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా నైట్‌రైడర్స్‌-బెంగళూరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌తో ఈ ఏడాది ఐపిఎల్‌ సీజన్‌ ప్రారంభమైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా, 2024 సీజన్‌ రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు ఈసారి ప్లే-ఆఫ్స్‌ రేసునుంచి ముందే నిష్క్రమించాయి. గత సీజన్‌లో నిరాశపరిచిన ముంబయి ఇండియన్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌తోపాటు మూడుసార్లు రన్నరప్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఈసారి ముందే ప్లే-ఆఫ్స్‌కు చేరాయి. ఇవన్నీ రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే-ఆఫ్స్‌ బెర్త్‌లను ఖాయం చేసుకోవడం విశేషం. ఇక లీగ్‌ స్టేజ్‌లో అత్యధిక పాయింట్లు సాధించి టాప్‌-2 స్థానాల్లో ఉన్న జట్లకు జాక్‌పాట్‌ దక్కినట్లే. ఎందుకంటే.. తొలి క్వాలిఫయర్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటే… ఓడిన టీమ్‌కు మరో ఛాన్స్‌ ఉంటుంది. క్వాలిఫయర్‌-2లో గెలిస్తే టైటిల్‌ పోరుకు చేరుకుంటుంది. అందుకే అన్ని జట్లూ తొలి రెండు స్థానాల్లో ఉండాలని కోరుకుంటాయి. ఈ క్రమంలోనే పంజాబ్‌, బెంగళూరు జట్లు అందని అంచనాలను తలక్రిందులు చేస్తూ టాప్‌-2 బెర్త్‌లకు ఎగబాకి టైటిల్‌కు చేరువయ్యాయి.
ప్లే-ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు
అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సిబి), గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ ఇప్పటికే ప్లే-ఆఫ్స్‌ బెర్త్‌లను ఖారారు చేసుకున్నాయి. చివరి రెండు మ్యాచుల్లో ఓడిన గుజరాత్‌ జట్టు అగ్రస్థానం నుంచి ఆ తర్వాతి స్థానాలకు దిగజారింది. చివరి లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఝలక్‌ ఇచ్చి పంజాబ్‌ కింగ్స్‌ అనూహ్యంగా టాప్‌-2లోకి ఎగబాకింది. ముంబయి ఇండియన్స్‌ 4వ స్థానానికే పరిమితం కాగా.. 2, 3 స్థానాలపై ఉత్కంఠ నెలకొంది.
ముంబయికి కలిసిరాని నాల్గోస్థానం
మూడు, నాలుగు స్థానాలు మాత్రం ముంబయికి అస్సలు కలిసిరావడం లేదు. రెండుసార్లు ఇలా క్వాలిఫయర్‌-2లోకి అడుగు పెట్టినా.. ఫైనల్‌కు వెళ్లలేకపోయింది. ఇక మరో రెండుసార్లు ఎలిమినేటర్‌లోనే ఇంటిముఖం పట్టింది. ముంబయి ఇండియన్స్‌ 2011, 2012 సీజన్లలో 3వ స్థానం.. 2014, 2023 ఎడిషన్లలో నాలుగో స్థానంతో ప్లే-ఆఫ్స్‌లో తలపడింది. ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరుకోలేదు. ఇప్పుడు కూడా ముంబయి ఫ్యాన్స్‌ను కలవరపెట్టే అంశమిదే. ఈసారి కూడా నాలుగో స్థానంలోనే ఈ జట్టు ప్లేఆఫ్స్‌కు సిద్ధమవుతోంది. కానీ, అసలు ప్లేఆఫ్స్‌కు రావడమే కష్టమనుకున్న జట్టు టైటిల్‌ రేసులో నిలవడమే సెన్సేషన్‌. ఇక్కడ ఓ విషయం గుర్తు తెచ్చుకోవాలి. ముంబయి వరుసగా ఐదు అంతకంటే ఎక్కువ విజయాలు నమోదు చేసి ప్లే-ఆఫ్స్‌కు చేరుకున్నాక.. టైటిల్‌ను వదిలిపెట్టిన దాఖలాలు లేవని చరిత్ర చెబుతోంది. ఇందుకు 2020 సీజనే ఉదాహరణ. చివరిసారిగా ముంబయి ఛాంపియన్‌ అయిన సీజన్‌ అదే. తొలి మూడు మ్యాచుల్లో ఒక్కటే విజయం. కానీ, ఆ తర్వాత చెలరేగి ఛాంపియన్‌గా నిలిచింది. మరోసారి ఆ విక్టరీ సీన్‌ రిపీట్‌ చేయాలనేది ముంబయి జట్టు అభిమానుల ఆకాంక్ష. ఐదుసార్లు విజేతగా నిలిచిన జట్టును రోహిత్‌ శర్మ నడిపించాడు. ఇప్పుడు హార్దిక్‌ పాండ్య ఎలాంటి మ్యాజిక్‌తో చేస్తాడో చూడాలి.
10రోజులు పొడిగింపు
భారత్‌-పాకిస్తాన్‌ దేశాల ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం(25 ఆదివారం)తో ముగియాల్సిన ఐపిఎల్‌ సీజన్‌ మరో 10 రోజులు పొడిగించబడింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒకానొక దశలో మిగిలిన ఐపిఎల్‌ మ్యాచ్‌లను యుఏఇ, దక్షిణాఫ్రికాలో నిర్వహించేందుకు నిర్వాహకులు సైతం సిద్ధమయ్యారు. కానీ వారం రోజుల్లోనే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడంతో మే 17నుంచి తిరిగి ఐపిఎల్‌ టోర్నీ ప్రారంభమైంది. ఆ సమయానికి మరో 15మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఐపిఎల్‌ చరిత్రలో తొలిసారి ఫైనల్‌ మ్యాచ్‌ను ఆదివారం కాకుండా (జూన్‌-3) మంగళవారంతో ముగియనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -