Tuesday, June 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంటెహరాన్‌ వీడండి

టెహరాన్‌ వీడండి

- Advertisement -

– ఇజ్రాయిల్‌ మిలటరీ హెచ్చరిక
– ఇరాన్‌పై ఉధృతంగా కొనసాగుతున్న దాడులు
– ఇప్పటివరకు 220మందికి పైగా మృతి
టెల్‌ అవీవ్‌, టెహరాన్‌:
ఇరాన్‌ రాజధాని టెహరాన్‌పై మరిన్ని దాడులు జరుగుతాయని ఇజ్రాయిల్‌ కొత్తగా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు టెహరాన్‌ వ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్ళ శబ్దాలు వినిపిస్తున్నాయి. తూర్పు, పశ్చిమ టెహరాన్‌ల్లో పలు లక్ష్యాలపై దాడులు జరుగుతున్నాయి. వీటిలో పశ్చిమ టెహరాన్‌లోని మిలటరీ స్థావరంపైనా దాడి జరిగిందని ఇరాన్‌ మీడియా తెలిపింది. ఇప్పటివరకు ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 220 దాటింది. వీరిలో 70మంది మహిళలు, పిల్లలు వున్నారు. ఆదివారం నాటి దాడుల్లో ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, మరో ఇద్దరు సైనిక జనరల్స్‌ మృతి చెందారు. ఇరాన్‌లోని నటాంజ్‌ యురేనియం శుద్ధి కర్మాగారానికి మరింతగా నష్టం వాటిల్లుతున్న సూచనలేమీ లేవని ఐక్యరాజ్య సమితి అణు పర్యవేక్షక సంస్థ రాఫెల్‌ గ్రాసి చెప్పారు. ఆస్పత్రులు, నివాస ప్రాంతాలపై ఇజ్రాయిల్‌ విచక్షణారహితంగా దాడులు జరుపుతోందని, ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, యుద్ధ నేరం కిందకే వస్తుందని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బాఘె విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కెర్మాన్‌షాలోని ఫారాబి ఆస్పత్రి లక్ష్యంగా ఇజ్రాయిల్‌ దాడులు జరిపిందని, దీంతో ఆస్పత్రిలో కొంత భాగం ధ్వంసమైందని ఇరాన్‌ మీడియా తెలిపింది. విరిగిన గాజు తలుపులు, కిటికీలు, నెత్తురోడుతున్న నేతలు, చిందరవందరగా పడిన పరికరాలు అక్కడ వాతావరణం భయానకంగా వుందని మీడియా వార్తలు తెలిపాయి.
టెహరాన్‌ వీడండి
టెహరాన్‌ గగనతలంపై పూర్తిగా పట్టు సాధించామని, విజయానికి చేరువలో వున్నామని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు చెప్పుకున్నారు. రక్షణమంత్రి ఇజ్రాయిల్‌ కట్జ్‌, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఇయాల్‌ జమీర్‌లతో కలిసి సెంట్రల్‌ ఇజ్రాయిల్‌లోని టెల్‌నోఫ్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అణు ముప్పును నిర్మూలించడం, క్షిపణి ముప్పును తుదముట్టించడం ఈ రెండు తమ లక్ష్యాలని చెప్పారు. తక్షణమే రాజధాని టెహరాన్‌ను వీడాలని ఆయన ప్రజలను హెచ్చరించారు. తాము తాజా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టెహరాన్‌లో కమాండ్‌ సెంటర్లపై దాడి చేశామని ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రకటించింది. తమ పౌరులపై దాడులు జరిపితే ఇరాన్‌ అందుకు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ హెచ్చరించారు.
మధ్యవర్తిత్వం నెరపండి
ఇరాన్‌తో తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించేలా ఇజ్రాయిల్‌ను ఒప్పించేందుకు అమెరికా అద్యక్షుడు ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురా వాల్సిందిగా కతార్‌, సౌదీ అరేబియా, ఒమన్‌లను ఇరాన్‌ కోరింది. తద్వారా ఇరాన్‌ కూడా అమెరికాతో అణు చర్చలకు సిద్ధమవుతుందని తెలిపింది. ఆదివారమంతా పరస్పరం మాట్లాడు కుంటూ, ఇరాన్‌తో మాట్లాడుతూ గల్ఫ్‌్‌ నేతలకు బిజీగా గడిచింది. ఇరాన్‌కు ఆత్మ రక్షణ కోసం చర్యలు తీసుకునే హక్కు వుందని రష్యా స్పష్టం చేసింది. ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య ఉద్రిక్తతలకు స్వస్తి పలకడానికి దౌత్య చర్యలు అవసరమని టర్కీ నేత ఎర్డొగన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. మరోవైపు ఇజ్రాయిల్‌ అత్యంత దూకుడుగా పాల్పడుతున్న దాడులను ఇరాన్‌ సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. ఈ సందర్భం గా టెల్‌ అవీవ్‌లోని అమెరికా ఎంబసీకి స్వల్పంగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, టెహరాన్‌లో పరిస్థితులు దారుణంగా మారుతుండడంతో భారత్‌ అక్కడి తన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -