నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై మహేష్ గౌడ్ ఆరోపణలు చేయడంతో ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తుంది. తనపై ఫోన్ ట్యాపింగ్ కేసులో అసత్య ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కార్, తమ చేతకాని తనాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అయితే, టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ మా ఫోన్లను ట్యాప్ చేశారని టీపీసీసీ వర్కంగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం దారుణమైన చర్య.. ఈ చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి అని విమర్శించారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలే ఉండాలనే దురుద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫోన్ ట్యాపింగే కారణమని ఆరోపించారు. ఈరోజు వాస్తవాలు బయటకు వచ్చాయి.. చట్టానికి వ్యతిరేకంగా అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారని మహేష్ గౌడ్ తెలిపారు.