Saturday, May 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిద్దాం

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిద్దాం

- Advertisement -

– నాణ్యమైన విద్యను పొందుదాం: మాజీ ఎమ్మెల్సీ ఏ.నర్సిరెడ్డి
– నారాయణపేటకు చేరిన పౌరస్పందన వేదిక జాతా
నవతెలంగాణ -నారాయణపేట

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిద్దామని, ప్రభుత్వ బడులు నిలబడాలని చదువులో అంతరాలు పోవాలని పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఏ.నర్సిరెడ్డి తెలిపారు. తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల బలోపేతం కోసం చేపట్టిన జీపు జాత గురువారం నారాయణపేటకు చేరుకున్నది. టీఎస్‌ యూటీఎఫ్‌్‌ నాయకులు, సీఐటీయూ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌, చిట్టెం నర్సిరెడ్డి చౌరస్తా దగ్గర ప్రజలను ఉద్దేశించి నర్సిరెడ్డి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కోసం టీఎస్‌ యూటీఎఫ్‌తో పాటు తెలంగాణ పౌర స్పందన వేదిక కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విశాలమైన తరగతి గదులు, సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడుసార్లు కోడి గుడ్లు, రాగి జావా అందిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించి ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలని కోరారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడతాయని తెలియజేశారు. ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యాబోధన, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని, అత్యున్నత విద్యార్హతలు కలిగిన టీచర్లు ఉంటారని అన్నారు. తల్లిదండ్రుల ఆశలను ప్రయివేటు విద్యావ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని, చదువుల నాణ్యతలో ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ బడి మూత పడితే సమాజానికి నష్టమని, మన ఊరు- మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతుల కల్పన మెరుగైందని తెలిపారు. కార్యక్రమంలో పౌర స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కేఏ మంగా, కమిటీ సభ్యులు నాగమణి, కావ్య, ధన మూర్తి, నాయకులు కె.భీమయ్య, శశిరేఖ, వెంకట్‌ నాయక్‌, గోవిందు, మోహన్‌, మాణిక్యప్ప, జి. వెంకట్రామిరెడ్డి, అంజిలయ్యగౌడ్‌, కాశప్ప, నరహరి, రిటైర్డ్‌ ఉపాధ్యాయులు లక్ష్మణ్‌, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -