Tuesday, June 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ బడులను కాపాడుకుందాం

ప్రభుత్వ బడులను కాపాడుకుందాం

- Advertisement -

– మన ఊరి పిల్లలను మన ఊరి ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం
– నల్లగొండలో విద్యార్థుల నమోదు ప్రచార జాత :టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కొరకు టీఎస్‌యూటీఎఫ్‌ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రచారజాతాను చావ రవి.. క్లాక్‌టవర్‌ సెంటర్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం ఉన్నాయన్నారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వబడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉన్నదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, వర్క్‌ బుక్కులు, ఏకరూప దుస్తులు ఉచితంగా అందించబడుతున్నాయని, నాణ్యమైన మధ్యాహ్నభోజనం, వారానికి మూడుసార్లు కోడిగుడ్డు, రాగిజావ అందిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించి, ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలన్నారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడుతాయని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన, ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని, అత్యున్నత విద్యార్హతలు కలిగిన టీచర్లు ఉంటారని తల్లిదండ్రులకు వివరిస్తామని తెలిపారు. తల్లిదండ్రుల ఆశను ప్రయివేట్‌ విద్యా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని, చదువుల నాణ్యతలో ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని అన్నారు. కుటుంబ సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.
ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టం అని, మన ఊరు – మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతుల కల్పన మెరుగయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బక్కా శ్రీనివాస్‌చారి, పెరుమాళ్ళ వెంకటేశం, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, జి.అరుణ, సరళ, వి.జగదీష్‌బాబు, ఎస్‌ఓ కత్తుల రవీందర్‌, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు బద్రీనాథ్‌, మంగ్లానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -