Tuesday, July 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

- Advertisement -

– రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి
– జులై 17న రైల్‌రోకో నిర్వహించి తీరుతాం : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
– సింగరేణి జాగృతి రైల్‌రోకో పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఢిల్లీకి వెంటనే అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జులై 17న రైల్‌రోకో నిర్వహించి తీరుతామని ఆమె స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సింగరేణి జాగృతి రూపొందించిన రైల్‌రోకో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. బీసీ సమాజం, తెలంగాణ జాగతి, యూపీఎఫ్‌ పోరాటాలతోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు వేర్వేరు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పాస్‌ చేసిందని తెలిపారు. అయితే ఆ బిల్లులకు చట్టబద్ధత కల్పించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని ఆక్షేపించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే రైల్‌రోకోకు పిలుపునిచ్చినట్టు తెలిపారు.
జులై 16, 17, 18 తేదీల్లో ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్లు తేల్చకుండానే కాంగ్రెస్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే కుట్రలు చేస్తోందని విమర్శించారు. రాజకీయ పార్టీల పరంగా బీసీలకు అవకాశం కల్పించడం కాదు, చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. ఓడిపోయే స్థానాలను బీసీలకు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఉందని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల సాధన కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జాగృతి నాయకులు వెంకట్‌, నరేశ్‌ నేత, శ్రీనివాస్‌, భువనచంద్ర, సిద్దిఖ్‌ షేక్‌, అనిల్‌, శ్రీకాంత్‌ రెడ్డి, సందీప్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణిలో సర్వేయర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి
సింగరేణి కాలరీస్‌ సంస్థలో ఇంటర్నల్‌ సర్వేయర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. సింగరేణిలో పని చేస్తున్న కార్మికులు సర్వేయర్‌ కోర్సు పూర్తి చేసి డీజీఎంఎస్‌ నుంచి సర్టిఫికెట్లు అందుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంస్థలో ఇంటర్నల్‌ సర్వేయర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని గుర్తుచేశారు.

ఇది ఐదు గ్రామాల ప్రజలు, తెలంగాణ జాగతి విజయం
భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా, పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం ఆ ఐదు గ్రామాల ప్రజలు, తెలంగాణ జాగృతి సాధించిన విజయమని కవిత అన్నారు. ఐదు గ్రామాలను విలీనం చేయాలని కోరుతూ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాకు లేఖ ఇవ్వడాన్ని ‘ఎక్స్‌’ వేదికగా ఆమె స్వాగతించారు. ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్టణం, గుండాల గ్రామాలు ఏపీలో విలీనం అయ్యాయని తెలిపారు. ఐదు గ్రామాల గోడుపై తెలంగాణ జాగృతి ఈనెల 20న ‘పోలవరం-తెలంగాణపై జలఖడ్గం’ పేరుతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతోనే ఐదు గ్రామాలను విలీనం చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఐదు గ్రామాలను విలీనం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ పాలన సాగుకు స్వర్ణ యుగమనీ, ఇదే విషయాన్ని కేంద్ర అర్థగణాంక శాఖ తాజా నివేదికలో స్పష్టం చేసిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పదేండ్లలోనే రాష్ట్ర పంట ఉత్పత్తుల విలువ రూ.70 వేల కోట్లకు పైగా పెరిగిందని తెలిపారు. పాశమైలారం ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -