ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్
న్యూఢిల్లీ : 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ 100 రోజుల కౌంట్డౌన్ మొదలైంది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పోటీల బ్రాండ్ అంబాసిడర్ కంగనా రనౌట్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ చీఫ్ పాల్, భారత పారాలింపిక్స్ పతక విజేతలతో కలిసి ఢిల్లీ సీఎం రేఖా గుప్త లోగో, మస్కట్ (విరాజ్)ను ఆవిష్కరించారు. ఈ పోటీలను భారత్ తొలిసారి నిర్వహిస్తుండగా.. గతంలో ఖతార్, యుఏఈ, జపాన్లు మాత్రమే ఆసియా నుంచి ఆతిథ్యం అందించిన జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు జరిగే పోటీల్లో 186 పతక ఈవెంట్లు ఉన్నాయి. ఇందులో 101 మెన్స్, 84 ఉమెన్స్, ఒక మిక్స్డ్ విభాగం ఉన్నాయి. ‘ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో 100కు పైగా దేశాలు పోటీపడతాయి. అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్ల నిర్వహణలో సత్తా చాటేందుకు భారత్కు ఇదో మంచి అవకాశమని’ భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు, పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ దేవేంద్ర ఝజారియ అన్నారు. ఈ పోటీల కోసం న్యూఢిల్లీలోని జవహార్లాల్ నెహ్రూ స్టేడియాన్ని త్వరలోనే ఆధునీకరించనున్నారు.
లోగో, మస్కట్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -