నవతెలంగాణ-హైదరాబాద్: లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (LRS) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 3వ తేదీతో ముగిసిన గడువును మే 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం.. ఎల్ఆర్ఎస్పై రాయితీ గడువును తొలుత మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత దాన్ని ఏప్రిల్ 30 వరకు, ఆ తర్వాత మే 3 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది.
సాంకేతిక సమస్యలు తలెత్తడం, ప్రజల నుంచి స్పందన లేకపోవడం తదితర కారణాలు పథకం అమలుకు అడ్డంకిగా మారిన నేపథ్యంలో రాయితీ గడువును మళ్లీ మళ్లీ పొడిగిస్తున్నట్టు తెలిసింది. 2020లో ప్రారంభమైన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం కింద 25.67 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారిలో 40 శాతం మందికి అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే 5.19 లక్షల మంది మాత్రమే ఏప్రిల్ 30 నాటికి చెల్లింపులు పూర్తి చేశారు. ఈ పథకం ద్వారా రూ.20,000 కోట్ల ఆదాయాన్ని ఆశించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటివరకు రూ.1,863 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలో మరింత మంది దరఖాస్తుదారులకు అవకాశం కల్పించేందుకు గడువును జూన్ వరకు పొడిగించే యోచనలో ఉన్నది.