నవతెలంగాణ-హైదరాబాద్: 2008 మాలెగావ్ కేసులో బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సహా నిర్దోషులుగా ప్రకటించిన ఏడుగురికి బాంబే హైకోర్టు గురువారం నోటీసులిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ అంఖద్లతో కూడిన డివిజన్ బెంచ్ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ), మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. రెండువారాల్లోగా వాటిని అందజేయాలని ఆదేశిస్తూ.. ఈ కేసు తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది.
ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మృతుల కుటుంబసభ్యులు బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బిజెపి మాజీ ఎంపి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా నిందితులందరినీ నిర్దోషులుగా విడిచిపెడుతూ 2025 జులై 31న ప్రత్యేక ఎన్ఐఎ కోర్టు తీర్పు ఇచ్చింది. సంఘటన జరిగిన 17 ఏళ్ల తర్వాత సాక్ష్యాధారాలు లేవంటూ నిందితులను విడిచిపెట్టడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని ప్రతిపక్ష పార్టీలు సహా పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.