నవతెలంగాణ-హైదరాబాద్: చైనా మాంజా కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో ఐదేళ్ల బాలిక మాంజా కారణంగా ప్రాణాలు కోల్పోయింది. మేడ్చల్ జిల్లా ఖాజీపల్లి నుంచి తండ్రితో పాటు ఇద్దరు కుమార్తెలు ద్విచక్ర వాహనంపై కూకట్పల్లికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వివేకానందనగర్ హైవే వద్ద చైనా మాంజా బాలిక నిష్విక మెడకు చుట్టుకుంది. దాంతో ఆమె కిందపడిపోయింది. తీవ్ర గాయం కావడంతో బాలిక అక్కడకక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చైనా మాంజా సాధారణ నూలు దారం కాదు. ఇది నైలాన్ లేదా సింథటిక్ పదార్థంతో తయారవుతుంది. దానిపై గాజు ముక్కల పొడిని పూస్తారు. ఈ దారం పక్షుల రెక్కలను, మనుషుల నరాలను కోసేంత ప్రమాదకరంగా ఉంటుంది. ఇది తెగిపోయి ఎక్కడైనా చిక్కుకుంటే ప్రాణాంతకంగా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం చైనా మాంజా అమ్మకాలపై నిషేధం విధించినప్పటికీ, కొందరు రహస్యంగా విక్రయిస్తున్నారు.



