విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన
ఉపాధ్యాయుల ఆందోళనతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
నేటి ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేసిన ఐక్యవేదిక
అమరావతి : సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జిటి)కు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించాలన్న నిర్ణయంపై ఉపాధ్యాయలోకం భగ్గుమనడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఉపాధ్యాయులు కోరుతున్న విధంగా మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీల ప్రక్రియను నిర్వహించేందుకు అంగీకరించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తాం’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. అంతకుముందు పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ను ఉపాధ్యాయసంఘాల ఐక్యవేదిక నాయకులు కలిసి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎదురయ్యే సమస్యలు వివరించి, ఎస్జిటిలకు మాన్యువల్ పద్దతిలో కౌన్సిలింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆందోళనలు సోమవారం నాడు కొనసాగాయి. మంత్రి తిరస్కరణ నేపధ్యంలో ముందుగానే ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర మంత్రి లోకేష్ సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో వెబ్ కౌన్సిలింగ్కు బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్కు అంగీకరిస్తున్నట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఉన్న తనను టిడిపి ఎంఎల్సిలు కలిసి ఈ సమస్యపై చర్చించారని, ఉపాధ్యాయుల మనోభావాలు వివరించారని ఈ ప్రకటనలో ఆయన తెలిపారు.
వారి విజ్ఞప్తి మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. మాన్యువల్ కౌన్సిలింగ్కు అంగీకరిస్తూ మంత్రి ప్రకటన చేసిన నేపధ్యంలో మంగళవారం నిర్వహించదలచిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేస్తునట్లు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఎస్జిటి ఉపాధ్యాయుల బదిలీలు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంగీకరిస్తూ ప్రకటన చేయడం ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి విజయమని తెలిపింది.
మాన్యువల్ కౌన్సిలింగే
- Advertisement -
- Advertisement -