నవతెలంగాణ-హైదరాబాద్ : బీసీల కోసం జాగృతి తరపున అనేక పోరాటాలు నిర్వహించబోతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ అస్తిత్వం, వనరులు, సాంస్కృతిక వైరుధ్య పరిరక్షణ కోసం ఏర్పాటైనదే జాగృతి అని చెప్పారు. తెలంగాణ సమయంలో కేసీఆర్ చెప్పినట్టుగా జాగృతి ముందుకెళ్లిందని తెలిపారు. జయశంకర్ సార్ ఆలోచనలను తు.చ. తప్పకుండా పాటించామని చెప్పారు. జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో ఈరోజు జాగృతి ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీసీలను కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని కవిత అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్నాపై విమర్శలు గుప్పించారు. ఈ ధర్నా వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ తీసుకుని అఖిలపక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అన్ని పార్టీల నేతలకు ప్రభుత్వం లేఖలు రాయాలని చెప్పారు. ఈ నెల 15లోపు జాగృతి నూతన కమిటీల ఏర్పాటు ఉంటుందని కవిత తెలిపారు. జాగృతిలోకి వచ్చేందుకు ఎంతో మంది రెడీగా ఉన్నారని… తమకు అన్ని వర్గాల మద్దతు ఉందని చెప్పారు.