నవతెలంగాణ – హైదరాబాద్: బాగ్లాదేశ్లోని చైనా రాయబార కార్యాలయం తమ దేశ పౌరులకు కీలక సూచనలు జారీ చేసింది. అక్రమ పద్ధతుల్లో సరిహద్దులు దాటి వివాహాలు చేసుకోవద్దని, ఆన్లైన్ వేదికగా జరిగే పెళ్లిళ్ల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ నియంత్రణలోని గ్లోబల్ టైమ్స్ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. “సరిహద్దు డేటింగ్” వంటి మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని ఎంబసీ సూచించింది. అనధికారిక మార్గాల్లో లేదా వాణిజ్య మ్యాచ్మేకింగ్ ఏజెన్సీల ద్వారా “విదేశీ వధువులను” వెతకడం చైనా చట్టాల ప్రకారం నిషేధమని గుర్తుచేసింది. “విదేశీ వధువును కొనడం” అనే ఆలోచనను పూర్తిగా విడనాడాలని, బంగ్లాదేశ్లో వివాహం చేసుకునే ముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని చైనా పౌరులను కోరింది.
చైనాలో ఒకప్పుడు అమలులో ఉన్న ఒకే బిడ్డ విధానం, సాంస్కృతికంగా కొడుకులకే ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలతో ప్రస్తుతం లింగ అసమానత నెలకొంది. దీనివల్ల సుమారు 30 మిలియన్ల మంది చైనా పురుషులకు వివాహ వయసు వచ్చినా జీవిత భాగస్వామి దొరకడం లేదు. దీనిని అవకాశంగా మలుచుకున్న కొన్ని నేర ముఠాలు, వివాహం పేరుతో బంగ్లాదేశ్ మహిళలను అక్రమంగా చైనాకు తరలిస్తున్నాయని “ది డైలీ స్టార్” పత్రిక ఇటీవల ఒక కథనంలో పేర్కొంది.