నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్లో భారీ పేలుడు సంభవించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని క్వెట్టాలో జరిగిన ఈ పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. క్వెట్టాలోని జర్ఘున్ రోడ్లోని గల పాక్ ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయం సమీపంలో మంగళవారం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి.
ఈ ఘటనలో ఇప్పటి వరకూ 6 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది వరకూ గాయపడ్డారు. పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో కాల్పులు శబ్దం కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం అధికంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయితే, ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.