– 33 మంది ఐఏఎస్, ముగ్గురు ఐఎఫ్ఎస్లకు స్థాన చలనం
– రెవెన్యూ శాఖ నుంచి నవీన్మిట్టల్ బదిలీ
– హైదరాబాద్ కలెక్టర్గా దాసరి హరిచందన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 33 మంది ఐఏఎస్ అధికారులను, ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేశారు. అలాగే నలుగురు నాన్క్యాడర్ అధికారులకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శశాంక్ గోయల్ను న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా నియమించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా సీసీఎల్ఏ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న నవీన్ మిట్టల్ను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్ కుమార్ను బదిలీ చేసింది. సీసీఎల్ఏ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాష్, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ఉన్న గౌరవ్ ఉప్పల్కు తెలంగాణ ప్రభుత్వ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించారు. సమాచారశాఖ కమిషన్ కార్యదర్శిగా భారతి లక్పతి నాయక్ను, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న కిల్లు శివకుమార్ నాయుడును ఆర్అండ్ఆర్, భూ సేకరణ కమిషనర్గా, నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా ఉన్న రాజీవ్గాంధీ హనుమంతును రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రెటరీతో పాటు కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ కలెక్టర్గా వినయ కృష్ణారెడ్డి, జి.సృజనకు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న శివశంకర్ లోథేటికి వ్యవసాయ, సహకార శాఖ సంయుక్త కార్యదర్శిగా, సాధారణ పరిపాలన శాఖ సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మీని, ఏయిడ్స్ కంట్రోల్ పీడీగా ఉన్న హైమావతిని సిద్దిపేట కలెక్టర్గా, యూత్ సర్వీసెస్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్రెడ్డిని ఏయిడ్స్ కంట్రోల్ పీడీగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం పొట్రును సింగరేణి డైరెక్టర్గా, కె.నిఖిలను ఫిషరీస్ డైరెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. పర్యాటకశాఖ ఎండీగా సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతిని, ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ సీఈవోగా పీ ఉదరు కుమార్, టీజీపీఎస్సీ కార్యదర్శిగా ప్రియాంక ఆల,హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరి. సంగారెడ్డి కలెక్టర్గా పీ ప్రావీణ్యను బదిలీ చేసింది. గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. నిర్మలా కాంతి వెస్లీ తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషనర్గా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఇ.నవీన్ నికోలస్, మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్గా మిక్కిలినేని మను చౌదరి, ఖమ్మం కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి, హనుమకొండ కలెక్టర్గా స్నేహ శబరీష్, పౌర సరఫరాలశాఖ డైరెక్టర్గా ముజామిల్ ఖాన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పారుని వరంగల్ మున్సిపల్ కమిషనర్గా, అశ్విని తానాజి వాఖాడేను ఆదిలాబాద్ కలెక్టర్గా, ప్రఫుల్ దేశాయిని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా, బి.షఫిఉల్లాను మైనార్టీ శాఖ కార్యదర్శిగా, విఎస్ఎన్వి.ప్రసాద్ను అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్గా, టీజీఐఐసీ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తిని పరిశ్రమల శాఖ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. అలాగే నాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారులైన జె.శంకరయ్యకు. తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీగా, పి.శ్రీకాంత్కు ఆయూష్ డైరెక్టర్గా, పవన్కుమార్కు టీజీఐఐసీ ఈడీగా, జి.మల్సూర్కు ముఖ్యమంత్రి ముఖ్య పౌరసంబంధాల అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
భారీగా ఐఏఎస్ల బదిలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES