నవతెలంగాణ-హైదరాబాద్ : మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలముకున్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా బలగాలు బుధవారం భారీ వైమానిక దాడులకు దిగాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ తీరప్రాంతంలో ఉన్న భూగర్భ క్షిపణి స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో సుమారు 2,268 కిలోల బరువుండే అత్యంత శక్తిమంతమైన ‘బంకర్ బస్టర్’ బాంబులను ఉపయోగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ బాంబులు భూగర్భంలోని కాంక్రీట్ కట్టడాలను ఛేదించుకుని వెళ్లి, అక్కడ దాచి ఉంచిన నౌకా విధ్వంసక క్షిపణులను పూర్తిగా నాశనం చేశాయని తెలిపింది. అంతర్జాతీయ నౌకాయానానికి ఈ క్షిపణుల నుంచి ముప్పు పొంచి ఉందన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
అయితే, ఈ విషయంలో మిత్రదేశాల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. “మాకు ఎవరి సహాయం అవసరం లేదు, ఒంటరిగానే ఇరాన్ను ఎదుర్కోగలం” అని ఆయన స్పష్టం చేశారు. ఫ్రాన్స్ వంటి దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించడాన్ని ఆయన తప్పుబట్టారు.



