– పర్యావరణ రక్షణ కోసం ప్రజల్లో చైతన్యం
– డా. హిప్నో పద్మా కమలాకర్
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, హైదరాబాద్ ఇందిరా పార్క్ లో మహావీర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ శాఖ, నవభారత లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్ డా. హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత మాత్రమే కాదు, మన భవిష్యత్తు భద్రత కూడా అన్నారు.
అవసరంకన్నా ఎక్కువగా వాడుతున్న ప్లాస్టిక్ మన భూమికి, సముద్రాలకు, జీవుల జీవితాలకు ముప్పుగా మారిందని, ప్రతి ఒక్కరూ తమ వాడకపు అలవాట్లను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహావీర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ శాఖ నిర్వాహకురాలు చాందినీ, డా.హిప్నో పద్మా కమలాకర్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్న సందేశంతో కాటన్ సంచులు, మొక్కలు పంపిణీ చేశారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను కాపాడాలన్నారు. నీటిని వృథా చేయొద్దు, వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని కోరారు.
విద్యుత్ వినియోగాన్ని నియంత్రించి సౌరశక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
పిల్లల్లో ప్రకృతి పై ప్రేమను పెంపొందించాలని చెప్పారు. పాఠశాలల ద్వారా పర్యావరణ విద్యను ప్రోత్సహించాలన్నారు.
“అందరినీ ప్రేమించు – అందరికీ సేవ చేయు”,
“నీటిని ఆదా చేయు – చెట్లను రక్షించు” అనే నినాదాలతో ఈ కార్యక్రమం ముగిసింది.
పలువురు వాలంటీర్లు, యువత, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజానీకం పాల్గొని, ఈ కార్యాచరణలో భాగస్వాములయ్యారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇదొక చైతన్యదాయకమైన అడుగని నిర్వాహకులు తెలిపారు.
