నవతెలంగాణ-హైదరాబాద్: కన్నడ అనువాదంలో జరిగిన పొరపాటుపై కర్నాటక సీఎం సిద్దరామయ్యకు మెటా సంస్థ క్షమాపణ చెప్పింది. ఇలా జరిగినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొంది. కన్నడ అనువాదం సరిగా లేదనే సమస్యను పరిష్కరించామని మెటా ప్రతినిధి తెలిపారు. అనువాదంలో ఏఐ టూల్ మిషన్ తప్పిదం వల్ల ఇలా జరిగిందని కంపెనీ ఫేస్బుక్లో పేర్కొంది. కచ్చితమైన అనువాదాన్ని అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించింది. సాంకేతికతను మెరుగుపరచడానికి నిరంతరం అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని చెప్పింది.
ఇటీవల ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూశారు. ఆమె మృతికి సంతాపం తెల్పుతూ సిద్ధరామయ్య కన్నడలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ను ఇంగ్లీషులోకి మెటా సంస్థ తప్పుగా అనువదించింది. సిద్ధరామయ్య కన్నుమూత అంటూ అనువదించింది. ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పింది. దీంతో మెటాకు సిద్ధరామయ్య ఘాటు లేఖ రాశారు. కన్నడ ఆటో ట్రాన్స్లేషన్ ఫీచర్ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. తాజాగా స్పందించిన మెటా జరిగిన పొరపాటుపై క్షమాపణలు కోరింది.