– ఇంటర్న్ స్టైఫండ్, పీజీ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ల స్టైఫండ్స్ను
– 15 శాతం పెంచుతూ నిర్ణయం
– సంబంధించిన జీవో 90 విడుదల
– బీఆర్ఓను రిలీజ్ చేసిన అధికారులు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ హాస్పిటల్స్లో పని చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. ఇంటర్న్ స్టైఫండ్, పీజీ డాక్టర్స్, సీనియర్ రెసిడెంట్ల స్టైఫండ్ను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదివారం సంగారెడ్డిలోని విద్యానగర్ కాలనీలో ఉన్న తన నివాసంలో జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో చర్చలు జరిపారు. జూనియర్ డాక్టర్ల సమస్యల పట్ల మంత్రి దామోదర్ సానుకూలంగా స్పందించారు. మంత్రి స్పందనకు జూనియర్ డాక్టర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు చర్చలకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. స్టైఫండ్ పెంపుతో ఇంటర్న్లకు నెలకు రూ.29,792, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో రూ.67,032, సెకండ్ ఇయర్లో రూ.70,757, ఫైనల్ ఇయర్లో రూ.74,782 చొప్పున స్టైఫండ్ అందనున్నట్టు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్లో రూ.1,06,461, సెకండ్ ఇయర్లో రూ.1,11,785, థర్డ్ ఇయర్లో రూ.1,17,103 చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నట్టు చెప్పారు. సీనియర్ రెసిడెంట్లకు, డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా రూ.92,575 నుంచి రూ.1,06,461 పెంచారన్నారు. పెంచిన స్టైఫండ్స్ను ఇకపై ప్రతి నెలా 10వ తేదీన చెల్లించాలని అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
బీఆర్ఓను రిలీజ్ చేసిన అధికారులు
ఈ మేరకు సంవత్సరానికి సరిపడా స్టైఫండ్స్ చెల్లించేందుకు అవసరమైన బీఆర్వోను (బడ్జెట్ రిలీజ్ ఆర్డర్) అధికారులు విడుదల చేశారు. అంతేకాకుండా పెండింగ్ ఉన్న స్టైఫండ్ బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. శని, ఆదివారాలు బ్యాంక్ సెలవులు కావడంతో సోమవారం జూడాల ఖాతాల్లో స్టైఫండ్ డబ్బులు జమ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇతర సిబ్బంది ఉద్యోగ కాలాన్ని మరో ఏడాది పాటు పెంచుతూ ఆర్థిక శాఖ జీవో విడుదల చేసింది. దాంతో వీరికి రెగ్యులర్ వేతనాలు చెల్లించేందుకు మార్గం సుగమమైంది.
టీచింగ్ ఫ్యాకల్టీ సమస్యకు చెక్
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ సమస్యకు చెక్పెడుతూ పలు చర్యలను ప్రభుత్వం తీసుకుంది. రెండ్రోజుల క్రితమే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ పోస్టుల ను సైతం త్వరలోనే భర్తీ చేయనున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్ డీఎంఈ వంటి పోస్టులను నేరుగా రిక్రూట్ చేసుకునే అవకాశం లేకపోవడంతో, ప్రమోషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ప్యానెల్ ఇయర్ రిలాగ్జేషన్ సైతం ఇచ్చినట్టు మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుమారు 231 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 308 మందికి, ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇచ్చింది. ఈ చర్యలో అన్ని కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత, డిపార్ట్మెంట్ హెచ్వోడీల సమస్య తీరనున్నది. అర్హత కలిగిన 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చింది. ఈ ప్రమోషన్లతో రాష్ట్రం లోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్స్, టీచింగ్ హాస్పిటళ్లకు రెగ్యులర్ సూపరింటెండెంట్లు రానున్నారు.
పెరిగిన కాలేజీలకు అనుగుణంగా ప్రణాళికలు
మెడికల్ కళాశాలలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నది. ఇందుకోసం జీవో 276 ద్వారా మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ)లను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు అన్ని కాలేజీలను సందర్శించి అనేక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తున్నాయి. వాటి ఆధారంగా ఆయా కాలేజీలు, హాస్పిటళ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. కొత్త హాస్టల్స్, ఉస్మానియా నిర్మాణం కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం కోసం పది సంవత్సరాలుగా జూడాలు, ఫాకల్టీ పోరాటాలు చేశారు. ఈ దశాబ్ద కాలపు ఆకాంక్షను నెరవేరుస్తూ, గోషామహల్లో కొత్త ఉస్మా నియా హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అలాగే, ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం సుమారు రూ.127 కోట్ల రూపాయలతో, అత్యాధునిక వసతులతో హాస్టల్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నది.