– కొత్తింటి కోసం రూ.5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణాయే…
– ఈ ఏడాది రూ.22 వేల కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు : అసిస్టెంట్ ఇంజనీర్లకు సర్టిపికెట్ల పంపిణీలో మంత్రి పొంగులేటి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భారతదేశంలో పేదల కొత్తింటి కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయేనని గుర్తు చేశారు. ఇంటి కోసం రూ.5లక్షలతో ఏడాదికి నాలుగున్నర లక్షల ఇండ్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. గృహనిర్మాణ కార్పొరేషన్లో ఔట్సోర్సింగ్లో నియామకమైన 350 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు ఆరు రోజులపాటు హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)లో శిక్షణ పొందారు. శనివారం ఇంజనీర్లకు మంత్రి సర్టిఫికేెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పంతోనే సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఈ ఏడాది రూ.22వేలకోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామనీ, ఇందుకు సంబంధించి మరికొద్దిరోజుల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ఆలోచనలకనుగుణంగా అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీ, నిబద్దతతో పని చేసి పేదవారి చిరకాల కోరిక నెరవేరుస్తున్నట్టు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగస్వాములు కావాలని అసిస్టెంట్ ఇంజనీర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎంపికైన 350 మంది ఇంజనీర్లలో 45 శాతం మహిళలే ఉండటం సంతోషించదగ్గ విషయమన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా మెరిట్ పద్దతిలోనే ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఇండ్ల పథకాల్లో కూడా కేంద్రం ఇస్తున్న నిధులతోనే అన్ని రాష్ట్రాలు సరిపెడుతున్నాయన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ ప్రభుత్వం రూ.ఐదు లక్షలతో 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఇండ్లను లబ్దిదారుడే నిర్మించుకునేలా పథకాన్ని రూపొందించిందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం కొద్ది రోజుల్లోనే నాలుగు లక్షల మంది జాబితా సిద్ధం చేయబోతున్నామని తెలిపారు. విధుల్లో చేరిన వెంటనే అసిస్టెంట్ ఇంజనీర్లు ఈ జాబితాలపై దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లకు గురికాకుండా అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు అందేలా క్షేత్రస్ధాయిలో పని చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తయిన వెంటనే దశలవారీ చెల్లింపుల్లో ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండాచూడాలన్నారు.
అందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని చెప్పారు. వివిధ దశల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు ప్రతి సోమవారం చెల్లింపులు చేస్తున్నట్టు వివరించారు. నిర్మాణ రంగంలో తనకు ఉన్న అనుభవంతో తక్కువ ఖర్చు, నాణ్యతతో ఇండ్లను నిర్మించేందుకు అధికారులకు పలు సూచనలు చేసినట్టు గుర్తు చేశారు. అనంతరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 21 మందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించిందని తెలిపారు. గ్రేడ్-2లో పని చేస్తున్న 10 మంది సబ్ రిజిస్ట్రార్లను గ్రేడ్-1కు సీనియర్ సహాయకులు పని చేస్తున్న 11 మందికి గ్రేడ్-2 పదోన్న తులు కల్పించామని తెలిపారు.
పేదల ఇంటి కలనేరవేరుస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES