– దుద్దెడ టోల్ గేట్ నుంచి సిద్దిపేట కలెక్టరేట్ వరకు ప్రయాణం
నవతెలంగాణ-కొండపాక
బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బుధవారం హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరిన మంత్రి.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్ గేటు వద్ద ఆగి సిద్దిపేట వైపు వెళ్తున్న కరీంనగర్ డిపో బస్సు ఎక్కారు. అక్కడి నుంచి సిద్దిపేట కలెక్టరేట్ వరకు ప్రయాణించి బస్సు దిగారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడారు. వారి సమస్య లు అడిగి తెలుసుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు, విద్యార్ధుల తో ముచ్చటించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో అందుతున్న ఉచిత ప్రయాణంపై ఆరా తీయగా ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీకి ప్రతినెలా ప్రభుత్వం రూ.330 కోట్లు చెల్లిస్తున్నదన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తే.. తాము ఆర్టీసీని నిలబెట్టామని తెలిపారు. కొత్త బస్సులు కొనుగోలు చేశామన్నారు. దేశానికే తెలంగాణ ఆర్టీసీ రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. విద్యార్ధులకు.. బాగా చదువుకోవాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్తో.. ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేస్తామని, జేఏసీ నాయకులతో జరిగిన సమావేశంలో కూడా ఇదే విషయం చెప్పామన్నారు. సమ్మెపై వెనక్కి తగ్గి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూసినందుకు ఆర్టీసీ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.
ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES