– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
పసుపు బోర్డుతో రైతులకు ప్రయోజనం కలిగేలా చూడాలని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిజామాబాద్లో నూతనంగా నెలకొల్పిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా బస్వా గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. తెలంగాణ ప్రాంత పసుపు రైతుల చిరకాల వాంఛను గుర్తించి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. అత్యధిక విస్తీర్ణంలో పసుపు సాగు చేసే నిజామాబాద్ జిల్లాలో బోర్డును నెలకొల్పడం వల్ల ఈ ప్రాంత రైతుల పోరాటం ఫలించినట్లయ్యిందన్నారు. జాతీయ పసుపు బోర్డుతో నిజామాబాద్ జిల్లా ప్రతిష్ట మరింతగా ఇనుమడిస్తుందని, పసుపు రైతులకు ఇతోధికంగా మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ బోర్డు ఏర్పాటు పసుపు పంట ఎగుమతులు, ఆధునాతన సాగు విధానాలు, యాంత్రీకరణ, సరికొత్త పరిశోధనలు, మెరుగైన మార్కెటింగ్ వంటి వసతులతో రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమమే పరమావధిగా పాలన సాగిస్తోందని తెలిపారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల కోసం ఏడాది కాలంలోనే తమ ప్రభుత్వం రూ. లక్ష కోట్ల వరకు వెచ్చించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజరు, రాష్ట్ర మంత్రి (ధనసరి అనసూయ) సీతక్క, ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
పసుపు బోర్డుతో రైతులకు ప్రయోజనం కలిగేలా చూడండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES