నవతెలంగాణ-హైదరాబాద్ : ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నాలుగు గేట్ల రోప్లు తెగిపోయాయి. మొత్తం 67 రేడియల్ గేట్లు ఉండగా.. ఎనిమిది గేట్ల రోప్లు నీటి ప్రవాహానికి తుప్పుపట్టాయి. వీటిలో నాలుగింటిని ఇటీవలే మార్చగా.. 8, 12, 19, 27 గేట్ల రోప్లు మార్చాల్సి ఉంది.. ఈలోపే అవి తెగిపోయాయి. కృష్ణా నదికి ముందస్తు వరద నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం 12వ నంబర్ గేటు నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. మరికొన్ని గేట్ల వద్ద రబ్బరు సీళ్లు సైతం దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా.. 12 గేట్ల ద్వారా అంతే మొత్తాన్ని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు.
ఇక, ఈరోజు ( జూన్ 28న ) జూరాల ప్రాజెక్టును రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని తెగిపోయిన నాలుగు గేట్ల రోప్లను పరిశీలించనున్నారు. అలాగే, జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను సైతం ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రాజెక్టు యొక్క భద్రతపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.