నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. అదే సమయంలో విచారణను నిలిపివేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చిన కర్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై కేసు నమోదైంది. దాంతో విజయ్ షా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు అరెస్టు చేయకుండా ఊరటనిచ్చింది. ఇదే కేసులో బుధవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కున్వర్ విజయ్ షా అరెస్టును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును పొడిగించింది.
కర్నల్ సోఫియా ఖురేషి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మంత్రిపై నమోదైన ఎఫ్ఐఆర్ను దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల సిట్ను ఏర్పాటు చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో కర్నల్ సోఫియా ఖురేషి మరో మహిళా అధికారి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్తో మీడియాకు వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత సోఫియా ఖురేషి పేరును ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో మధ్యప్రదేశ్ హైకోర్టు మంత్రిపై మండిపడింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత మంత్రి తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. కర్నల్ సోఫియా ఖురేషిని తన సోదరి కంటే ఎక్కువగా గౌరవిస్తానని చెప్పుకొచ్చారు.