– కానరాని పర్యాటకులు, పెట్టుబడులు
– మాయని మచ్చగా…లైంగిక వేధింపుల ఆరోపణలు
– ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని విచారణలో తేలింది : జయేశ్ రంజన్
– ఏం జరగనప్పుడు.. విచారణెక్కడిది : మంత్రి జూపల్లి
– ప్రభుత్వం చేసిన ఖర్చుపైనా భిన్నాభిప్రాయాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”తెలంగాణ జరూర్ ఆనా” అనే నినాదంతో మే 10 నుంచి నెలాఖరు వరకు 21 రోజుల పాటు సాగిన అందాల పోటీలు ముగిశాయి. ఆరంభ, ముగింపు వేడుకలతో పాటు కొన్ని కార్యక్రమాలను హైదరాబాద్లో నిర్వహించగా, నాగార్జునసాగర్, వరంగల్, రామప్ప, పోచంపల్లి తదితర ప్రాంతాల్లో మరి కొన్ని ఈవెంట్లను నిర్వహించారు. అయితే పోటీల నిర్వహణ తీరుపై ప్రభుత్వ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా ఆరోపణలపై అధికారులు చెప్పిన దానికి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి చెప్పిన దానికి పొంతన లేకుండా ఉంది. ఈ ఈవెంట్ను భుజానేసుకుని అన్నీ తానై నిర్వహిస్తున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మిల్లా ఆరోపణల్లో వాస్తవం లేదని మీడియాకు చెప్పారు. చౌహముల్లా ప్యాలెస్లో జరిగిన విందుపై ప్రభుత్వం అంతర్గతంగా విచారణ చేసిందనీ, లైంగిక వేధింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తమకు లభించలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇదే అంశంపై పర్యాటక శాఖ మంత్రి మాత్రం మరో విధంగా స్పందించారు. అసలు సంఘటనే జరగనప్పుడు విచారణెక్కడిదని ప్రశ్నించారు. మిల్లా ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. విచారణ జరిగిందా? లేదా? అనే అంశంపైనే అధికారులు, మంత్రి పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఆ రోజు చౌహముల్లా ప్యాలెస్లో జరిగిన ఘటనపై సీసీ ఫుటేజ్లను బయట పెట్టడంతో పాటు అధికారికంగా విచారిస్తేగాని వాస్తవాలు బయటపడే అవకాశాలు లేవు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకుంటే ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఖర్చు విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం రూ.31 కోట్లు ఖర్చు చేశామనీ, అందులో రూ.21 కోట్లు స్పాన్సర్ల ద్వారానే వచ్చాయని ప్రభుత్వం అంటోంది. మరో రూ.12 కోట్లకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలున్నాయనీ, వారు హామీ ఇచ్చిన మొత్తాన్ని చెల్తిస్తే సర్కార్పై నయాపైసా భారం పడబోదని చెబుతోంది. ఒక వేళ ఆ మొత్తం రాకుంటే రూ.10 కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం ఈ పోటీలకు సర్కార్ రూ.200 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపిస్తోంది. ఆ పార్టీ ఆరోపణలను సర్కార్ కొట్టి పారేసినా, చేసిన వ్యయంపై పూర్తి స్థాయి గణాంకాలు విడుదల చేయకపోవడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. అలాగే సర్కార్ మొదట్లో చెప్పినట్టు పర్యాటకులు, పెట్టుబడుల రాకపై కూడా సర్కార్ పెదవి విప్పడం లేదు.
ఏటా వేల సంఖ్యలో
ప్రపంచ వ్యాప్తంగా ఏటా వేల సంఖ్యలో అందాల పోటీలు జరుగుతాయి, అయితే బిగ్ ఫోర్గా పిలవబడే నాలుగు అంతర్జాతీయ సంస్థలు నిర్వహించే పోటీలనే అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా భావిస్తారు. అందులో మొదటిది మిస్వరల్డ్. హైదరాబాద్లో జరిగిన పోటీలను ఈ సంస్థే నిర్వహించింది. యూకేలో 1951లో ఎరిక్ మోర్లీ ఈ సంస్థను స్థాపించారు. 2000లో మోర్లీ మరణించినప్పటి నుంచి, అతని భార్య జూలియా మోర్లే పోటీలను నిర్వహిస్తున్నారు. రెండవది మిస్ యూనివర్స్. ఈ సంస్థను 1952లో కాలిఫోర్నియాకు చెందిన దుస్తుల కంపెనీ పసిఫిక్ మిల్స్ స్థాపించింది. మూడవది మిస్ ఇంటర్నేషనల్. దీన్ని ”మిస్ ఇంటర్నేషనల్ బ్యూటీ” అని కూడా పిలుస్తారు. టోక్యోకు చెందిన అంతర్జాతీయ కల్చరల్ అసోసియేషన్ 1960 నుంచి ఈ పోటీలను నిర్వహిస్తుంది. నాలుగోది మిస్ ఎర్త్. మిస్ ఎర్త్ ఫౌండేషన్ ద్వారా ఫిలిప్పీన్స్కు చెందిన కరౌసెల్ ప్రొడక్షన్స్ పర్యావరణాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న అందాల పోటీ ఇది. భారత దేశం నుంచి మిస్వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని ఐశ్వర్యరారు, ప్రియాంక చోప్రా, సుస్మితాసేన్ తదితరులు కిరీటాలు దక్కించుకున్నారు. అయితే మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ సంస్థల అందాల పోటీలు ఇండియాలో అంతగా ప్రాచుర్యం పొందలేదు.
మిల్లా ఆరోపణలు…
”హైదరాబాద్లో జరిగిన మిస్వరల్డ్ 2025 పోటీలు ఎంచుకున్న కాన్సెప్ట్కు భిన్నంగా జరిగాయి. బ్యూటీ విత్ పర్పస్ అనే లక్ష్యాన్ని పక్కన పెట్టి కేవలం బ్యూటీ దగ్గరే అవి ఆగిపోయాయి. ఈవెంట్ కోతుల ప్రదర్శనను తలపించింది. వేశ్యలాంటి భావనకు గురయ్యా. వినోదం కోసం మమ్మల్ని ఆట బొమ్మల మాదిరిగా ప్రదర్శనకు పెట్టారు. మేల్ స్పాన్సర్ల ముందు పరేడ్ చేయించారు” అని మిస్ ఇంగ్లాండ్ మిల్లా సన్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా గార్డియన్ అనే ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు. జుగుప్పాకరమైన సంఘటనలను చవి చూడాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా అందాల పోటీల్లో పాల్గొనే వారు నాజుగ్గా, సన్నగా నిర్దేశించిన కొలతలు ఉన్న వారే ఎంపికవుతారు. ప్లస్ సైజ్ అమ్మాయి అయిన మిల్లా మొదటి సారి మిస్ ఇంగ్లాండ్ కిరీటాన్ని అందుకుంది. పైగా ఆమె సీపీఆర్ గురించి చేస్తున్న ప్రచారం ఇంగ్ల్లాండ్ అంతా బహుళ ప్రాచుర్యం పొందింది. అలాంటి చరిత్ర ఉన్న అమ్మాయి చేస్తున్న ఆరోపణలు కొట్టి పారేయలేకుండా ఉన్నాయి.
ప్రభుత్వం నిర్వహించవచ్చా?
ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు, ప్రజల డబ్బుతో మిస్ వరల్డ్ లాంటి ప్రయివేట్ కార్యక్రమాలు నిర్వహించవచ్చా అనే సందేహం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. మూడు వారాల పాటు సాగిన ఈ ఈవెంట్ను ప్రజా ప్రతినిధులు, అధికారులు భుజానెత్తుకుని నిర్వహించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పోటీల ద్వారా ప్రభుత్వం తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇవ్వదల్చుకుందనే ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి. అయితే ఇలాంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ హయాంలోనే బీజాలు పడ్డాయి. ఈ కార్ రేస్ అంటూ గత సర్కార్ చేసిన హడావిడిపైనా అప్పట్లో విమర్శలు వచ్చాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. ఈ కార్ రేస్ పేరిట ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించింది. అయితే అధికారం చేపట్టిన వెంటనే కాంగ్రెస్ ప్లేట్ మార్చి తాము ఈ కార్ రేస్ అవినీతిని మాత్రమే వ్యతిరేకించామనీ, పోటీలకు వ్యతిరేకం కాదని చెబుతోంది. పైగా గత సర్కార్ బాటలోనే మిస్ వరల్డ్ ప్రయివేట్ కార్యక్రమాన్ని అన్నీ తానై నిర్వహించింది. ప్రజా ధనాన్ని ఇలాంటి కార్యక్రమాలకు వెచ్చించడం ఎంత వరకు సబబో సర్కార్ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
మిస్ వరల్డ్ 2025 సర్కార్ అంచనాలు తలకిందులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES