నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రియా రాజధాని వియన్నా నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని శుక్రవారం దుబాయ్కు మళ్లించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
ఏఐ-154 విమానం వియన్నా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని సమీపంలోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. విమానం దుబాయ్లో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఎయిరిండియా ప్రతినిధి స్పందిస్తూ “సాంకేతిక సమస్య తలెత్తినట్టు అనుమానం రావడంతో విమానాన్ని దుబాయ్కు మళ్లించాం. అక్కడ విమానానికి అవసరమైన అన్ని తనిఖీలు పూర్తి చేశాం. ఈ ఆలస్యం గురించి ప్రయాణికులకు తెలియజేసి, వారికి అల్పాహారం ఏర్పాటు చేశాం. తనిఖీల అనంతరం విమానం భారత కాలమానం ప్రకారం ఉదయం 8:45 గంటలకు దుబాయ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది” అని వివరించారు.