నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం, భాజపా సీనియర్ నేత విజయ్ రూపాణీ (Vijay Rupani) మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన మూడు రోజుల అనంతరం ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు. రూపాణీ కుటుంబ సభ్యుల నమూనాలతో మృతదేహం డీఎన్ఏ సరిపోలిందన్నారు. దీంతో భౌతికకాయాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు. ఇప్పటిదాకా 32 మంది మృతుల డీఎన్ఏ వారి కుటుంబసభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల సీనియర్ ప్రభుత్వ వైద్యుడు తెలిపారు.
అహ్మదాబాద్లో మాటలకందని పెను విషాదం తెలిసిందే. టేకాప్ అయిన నిమిషాల్లోనే లండన్ వెళ్లాల్సిన బోయింగ్ విమానం ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 241మందితో పాటు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మరణించారు. ఈక్రమంలో విమాన ప్రమాదం లో మరణించిన వారి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు కేవలం 32 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించారు.
ఈ విమాన ప్రమాదంలో 242 మందికిగాను 241 మంది ప్రాణాలు కోల్పోయారు. రమేష్ విశ్వాస్ అనే ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అదేవిధంగా హాస్టల్ భవనంలో ఉన్న వైద్యులు, సిబ్బంది కూడా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా మరో 14 మంది మరణించారు. దాంతో ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 279కి చేరింది.