హైదరాబాద్: జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ వెహికల్స్ టెండర్స్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజిన్లలో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్ స్టంట్ రిపేర్ టీమ్స్కు సంబంధించిన పనులు చేపట్టేందుకు పిలిచిన టెండర్లలో స్థానిక కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతోందని ఆమె లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పనులు చేపట్టేందుకు గతంలో కేవలం ఐదు నెలల కోసం టెండర్లు పిలువగా, ఈసారి మూడేళ్ల కాలపరిమితికి టెండర్లు పిలిచారని పేర్కొన్నారు. ఈ పనులు చేపట్టేందుకు వినియోగించే వాహనాల్లో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉండాలనే నిబంధనలు పెట్టారు. కానీ ఆ స్పెసిఫికేషన్స్ ఉన్న వాహనాలను విక్రయించే డీలర్లు హైదరాబాద్లో కేవలం ఇద్దరే ఉన్నారని అన్నారు.
ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారని వెల్లడించారు. ఆ సంస్థకు హైదరాబాద్ రెండు షోరూములు మాత్రమే ఉన్నాయి.. ఆ షోరూంలో నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారు.. తెలంగాణ కాంట్రాక్టర్లు కర్ణాటక షోరూముల డీలర్ల నుంచి ఎంవోయూలు తెచ్చుకున్నా.. వాటి ఫిజికల్ కాపీలు తక్కువ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు.
ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారని, ఇప్పుడు తొమ్మిది జోన్ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. అధికారులు పేర్కొన్న స్పెసిఫికేషన్స్ కూడిన వాహనాల్లో ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదన్నారు. గతంలో ఇందుకు వినియోగించిన వాహనాల్లో రెండు నుంచి మూడు క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించేవారని గుర్తుకు చేశారు. అధికారులు ఒక సంస్థకు, రెండు కాంట్రాక్టు ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి రూ.5.85 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. కాబట్టి ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి.. గతంలో మాదిరిగా వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుందని సూచించారు.