నవతెలంగాణ – హైదరాబాద్: హర్యానాలో రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఒక యువ మోడల్ను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పడేశారు. సోనిపట్ ప్రాంతంలో వెలుగు చూసిన ఈ దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సదరు యువతి కొన్నిరోజులుగా కనిపించకుండా పోగా, చివరకు విగతజీవిగా కనిపించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మృతురాలిని స్థానిక సంగీత పరిశ్రమలో మోడల్గా పనిచేస్తున్న శీతల్గా గుర్తించారు. ఆమె కొన్ని రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయగా, సోనిపట్లోని కండా గ్రామ సమీపంలోని ఒక కాలువలో శీతల్ మృతదేహం లభ్యమైంది.
ప్రాథమిక విచారణలో, దుండగులు శీతల్ గొంతు కోసి దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, శీతల్ను హత్య చేయడానికి గల కారణాలు తెలియరాలేదు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఇటీవల పంజాబ్కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కంచన్ కుమారి (30) కూడా ఇలాగే హత్యకు గురికావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బఠిండా జిల్లాలోని ఆదేశ్ యూనివర్సిటీ పార్కింగ్ స్థలంలో ఆపి ఉంచిన కారులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ‘కమల్కౌర్ భాబీ’ పేరుతో ఇన్స్టాగ్రామ్లో, ‘ఫన్నీ భాబీ టీవీ’ పేరుతో యూట్యూబ్లో కంచన్ కుమారికి లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో వెతికిన పోలీసులకు ఆమె కారులో శవమై కనిపించారు. ఇప్పుడు హర్యానాలో శీతల్ హత్యకు గురికావడం చర్చనీయాంశంగా మారింది.