Friday, June 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమోడీ అమెరికా చేతిలో కీలుబొమ్మ

మోడీ అమెరికా చేతిలో కీలుబొమ్మ

- Advertisement -

– సీతారామ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయాలి
– బహుళ జాతి సంస్థల చేతుల్లోనే విత్తనాల తయారీ
– పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలి : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు
నవతెలంగాణ-బోనకల్‌

అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ చేతిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలుబొమ్మగా మారారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ రావు అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతల గ్రామంలో డివిజన్‌ నాయకులు దొండపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్‌ రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. ముందుగా రైతు సంఘం జెండాను పోతినేని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయాలన్నారు. పంటలకు కనీసం మద్దతు ధర చట్టం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. విత్తనాల తయారీ బహుళ జాతి సంస్థల చేతుల్లోకి వెళ్లిందని, దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ప్రధాని మోడీ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ, ఎకరం 15 రూపాయల చొప్పున 5000 ఎకరాలను కారు చౌకగా అదానీకి కట్టబెట్టిందని విమర్శించారు. పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, రైల్వేలు అదానీకే అందేలా చేస్తున్నారని అన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల అమలు జరిగితే రైతులకు లాభం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేసే వరకు రైతు సంఘాలు ఐక్యంగా పోరాడి విజయం సాధించాయన్నారు. 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్‌కు రూ.70 పెంచి, 100 కేజీల ధాన్యానికి మాత్రం రూ.69 మాత్రమే మద్దతు ధర పెంచి.. ధర పెంచామంటూ కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని తెలిపారు. మిర్చిని మార్కెట్లలో రూ.13 వేలకు కొనుగోలు చేస్తుంటే కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజరు రూ.10,500 మాత్రమే కొనుగోలు చేయాలని ప్రకటించటం దారుణమన్నారు.
పహల్గాంలో 26 మంది పర్యాటకలను పొట్టను పెట్టుకున్న నలుగురు ఉగ్రవాదులను ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదనికేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉగ్రవాదుల స్థావరంగా ఉన్న పాకిస్థాన్‌పై యుద్ధం ఎందుకు ప్రారంభించారో, ఎందుకు నిలిపివేశారో ప్రధానమంత్రి దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేవలం అమెరికా అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలకు లొంగి యుద్ధాన్ని ఆపారని అన్నారు. సీతారామ ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నాలుగుసార్లు శంకుస్థాపనలు చేశారని విమర్శించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయటం లేదో జిల్లా రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీతారామ ప్రాజెక్టు వల్లే జిల్లా వ్యవసాయ రంగం సస్యశ్యామలం అవుతుందన్నారు. భవిష్యత్తులో రైతులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్‌, బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు చింతలచెరువు కోటేశ్వరరావు తదితరులు ఊపాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -