జాగ్రెబ్: లండన్లో జరిగిన జీ-7 సదస్సుకు హాజరై తిరుగు ప్రయాణంలో క్రొయేషియాలో ఆగిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ ప్రధాని ఆండ్రెస్ ప్లెంకోవిక్ నుండి ‘ప్రత్యేక బహుమతి’ అందుకున్నారు. వెజ్డిన్ సంస్కృత వ్యాకరణం యొక్క పునర్ముద్రణను మోడీకి ఆండ్రెస్ అందజేశారు. ఈ వ్యాకరణానికి సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది. ఇది రెండు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి సంబంధాలను సూచిస్తోంది. ఇది లాటిన్ భాషలో రాసిన మొట్టమొదటి ముద్రిత సంస్కృత వ్యాకరణం. 1790లో క్రోయేషియా పండితుడు, మిషనరీ ఫిలిప్ వెజ్డిన్ భారత పర్యటనలో ఉన్నప్పుడు దీనిని ప్రచురించారు. మోడీ పర్యటన సందర్భంగా ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం సహా ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసే అవకాశాలపై చర్చించారు. వ్యవసాయం, సంస్కృతి, సైన్స్, సాంకేతికత వంటి రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆసియాలో భారత్ తమకు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి అని ప్లెంకోవిక్ తెలిపారు. ప్రతినిధి బృందం స్థాయి చర్చల నిమిత్తం భారత ప్రధాని క్రొయేషియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నామని, వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తున్నామని ప్లెంకోవిక్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పెట్టిన పోస్టులో వివరించారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా తొలుత క్రొయేషియా చేరుకున్న ప్రధాని భారతీయ డయాస్పొరా సభ్యులతో ముచ్చటించారు. యూరోపియన్ యూనియన్ భాగస్వాములతో సంబంధాలను మరింత పటిష్టపరచుకోవాలన్న భారత్ సంకల్పాన్ని ఈ పర్యటన చాటిచెబుతోందని వార్తా సంస్థలు విశ్లేషించాయి.
క్రొయేషియాలో మోడీకి ప్రత్యేక బహుమానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES