నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి ప్రధాని మోడీపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా మాత్రమే కాల్పుల విరమణ జరిగిందని ప్రధాని ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.‘‘భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించానంటూ ట్రంప్ పదేపదే ఒకే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణలు తగ్గించడానికి తాము జోక్యం చేసుకున్నామని, వాణిజ్యాన్ని ఒక సాధనంగా వాడామని చెప్తున్నారు. చివరికి కోర్టులోనూ అదే వాదన. కానీ ట్రంప్ ప్రకటనలపై స్నేహితుడు నరేంద్రమోదీ పూర్తిగా మౌనం వహిస్తున్నారు. ఆయన ఎందుకు మాట్లాడటం లేదు..?’’ అని ఎక్స్ వేదికగా జైరాం రమేశ్ రాసుకొచ్చారు.
మే7 ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ వాయుసేనలు పాక్ ఉగ్రశిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో నాటకీయ పరిణామాల మధ్య ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధానికి ముంగిపు పలికాయి. అయితే అందరి కన్నా ముందే భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే ప్రకటించుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీని కొన్ని రోజులుగా ప్రశ్నిస్తోంది.