Monday, June 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవికసిత్‌ భారతే లక్ష్యంగా మోడీ పాలన

వికసిత్‌ భారతే లక్ష్యంగా మోడీ పాలన

- Advertisement -

– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌
– జాతీయ రహదారులను అనుసంధానం చేసిన ఘనత మోడీదే
– మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో అడుగడుగునా అవినీతే : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
– రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ : ఎంపీ ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వికసిత్‌ భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా ప్రధానమంత్రి మోడీ పాలన సాగుతున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ అన్నారు. మోడీ 11 ఏండ్ల పాలన, మల్కాజిగిరి ఎంపీగా ఈటల రాజేందర్‌ గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో బీజేపీ సంకల్ప సభ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన బన్సల్‌ మాట్లాడుతూ..వికసిత్‌ భారత్‌ నిర్మాణం 2045 నాటికి పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్‌ ఎంపీగా గెలిచి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..దేశాభివృద్ధికి రవాణా రంగం కీలకమని భావించి జాతీయ రహదారులను అనుసంధానం చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. యూపీఏ ప్రభుత్వంలో ఏ వార్త చూసినా కుంభకోణాలు, అవినీతిపై వార్తలు వచ్చేవని గుర్తుచేశారు. అందుకే మన్మోహన్‌సింగ్‌ను దింపి ప్రజలకు మోడీకి పట్టం గట్టారన్నారు. 11 ఏండ్ల పాలనలో మోడీ పాలనపై ఒక్క అవినీతి మచ్చ కూడా లేదని చెప్పారు. తెలంగాణలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒక్క రైల్వే స్టేషన్‌ కూడా అభివృద్ధి కాలేదనీ, మోడీ పాలనలో 40 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్‌ కుటుంబం చేతుల్లో బలైందని ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ సర్కారు విఫలమైందన్నారు. ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ..మోడీ గొప్ప విజనరీ, స్మితప్రజ్ఞ ఉన్న నేత అని కొనియాడారు. పదవులు ఎల్లకాలం ఉండవనీ, మానవసంబంధాలే ముఖ్యమని నొక్కి చెప్పారు. రేవంత్‌ వల్ల తెలంగాణ ఆతగౌరవం దెబ్బతిన్నదని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో అనేక పనులు, పథకాలు నడుస్తున్నాయని వివరించారు. కనీస ఆలోచన లేకుండా హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి నిర్ణయాలను రేవంత్‌రెడ్డి సర్కారు తీసుకున్నదనీ, దీనివల్ల పేద కుటుంబాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నాయని వాపోయారు. వాటికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారన్నారు.
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిం దన్నారు. ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లా డుతూ..రాహుల్‌గాంధీ కుటుంబం నుంచి ముగ్గురు ప్రధానులయ్యారు గదా వారు కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కులగణన చేయబోయే ఘనత మోడీకే దక్కుతుందన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి అభరుపాటిల్‌, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు, బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, శాసనమండలి పక్ష నేత ఏవీఎన్‌.రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే.అరుణ, బీజేపీ సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -