నవతెలంగాణ-హైదరాబాద: భారత్, బ్రెజిల్, చైనాలపై మరిన్ని ఆంక్షలు విధించవచ్చని నాటో చీఫ్ హెచ్చరించారు. పై మూడు దేశాలు రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే .. ద్వితీయ ఆంక్షలతో తీవ్రంగా నష్టపోతాయని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే బుధవారం బెదిరింపులకు దిగారు. అమెరికా కాంగ్రెస్లో సెనెటర్లతో సమావేశమైన రూటే ఈ వ్యాఖ్యలు చేశారు. ” మూడు దేశాలకు నేను ఇచ్చే సూచన ఇదే .. బీజింగ్లో లేదా ఢిల్లీలో నివసిస్తుంటే, లేదా మీరు బ్రెజిల్ అధ్యక్షులైతే కచ్చితంగా పరిశీలించాలి. ఇది మిమ్మల్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. దయచేసి రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్కాల్ చేయండి. శాంతి చర్చల గురించి తీవ్రంగా ఆలోచించమని చెప్పండి. లేకుంటే బ్రెజిల్, భారత్ మరియు చైనాలపై తీవ్ర స్థాయిలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది” అని అన్నారు
రానున్న 50 రోజుల్లో ఉక్రెయిన్పై దాడులను ఆపకపోతే తీవ్రమైన ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాకు గడువును విధించిన సంగతి తెలిసిందే. పోరును ఆపకపోతే రష్యా నుండి దిగుమతులు చేసుకునే దేశాలపై 100శాతం సుంకాలు విధిస్తానని బెదిరించారు.
శాంతి చర్చల్లో ఉక్రెయిన్కి యూరప్ మద్దతునిస్తుందని అన్నారు. ట్రంప్తో కుదిరిన ఒప్పందం ప్రకారం.. అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్కు భారీగా ఆయుధాలను సరఫరా చేస్తుందని, కేవలం వైమానిక రక్షణ మాత్రమే కాకుండా, క్షిపణులు, యూరోపియన్లు అందించే ఆయుధాలను కూడా అందిస్తుందని రూటే పేర్కొన్నారు.