నవతెలంగాణ-హైదరాబాద్: సినిమాలతో వినోదమే కాదు రాజకీయాలు చేయొచ్చు. ఇటీవల విడుదలైన దురంధర్-2 సినిమా చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు మోడీ అనుచర గణం వెండి తెరమీద ప్రచారానికి తెరలేపింది. సినిమా సాంతం మోడీ సెల్ప్ డబ్బు మోగించారు. హీరోలందరికన్నా సూపర్ హీరో ఎవరంటే మోడీనే అన్నట్టు నడిచిందని, సిక్స్ ప్యాక్తో కండల కొండలుగా కనిపించే హీరోలంతా ఆయన ముందు దిగదుడుపేనని బీబీసీ, అల్ జజీరా వంటి ప్రముఖ మీడియా సంస్థలు చమత్కరించాయి.
జస్మీత్ సింగ్ రంగీ అనే సిక్కు హీరో హమ్జాఅలీ మజారీగా పాకిస్తాన్ పాత రాజధాని కరాచీ ప్రాంతంలో సంఘ వ్యతిరేక శక్తుల స్థావరమైన ల్యారీ అనే చోటకు వెళ్లి ప్రత్యర్థులను అంతమొందించడం ఈ చిత్రంలో ఇతివృత్తం. మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా ప్రధానంగా డామినేట్ చేస్తే రెండో భాగం రణవీర్ మీదుగా నడుస్తుంది. 2014 ఎన్నికల ప్రచారం, మోడీ విజయం, మళ్లీ 2017లో నోట్లరద్దు తతంగం వీటిని వాస్తవంగా జరిగినవి చూపించినట్టు వుంటుంది.
ఈ చిత్రంలో మాత్రం దర్శకుడు నోట్లరద్దు గొప్ప మేలు చేసిందని చెప్పడానికి హీరోచిత కృత్యాలను ఉపయోగించుకుంటాడు. వైఫల్యాలను విజయాలుగా, విమర్శకులందరూ విద్రోహులుగా చూపించడం ఈ తరహా ప్రచార చిత్రాల ప్రధాన లక్షణం.
మోడీ మాత్రమే కాదు, అజిత్ దోవల్ వంటివారు కూడా భద్రతా వ్యవహారాలు అద్భుతంగా నడిపిస్తున్న చిత్రణ ఇస్తుంది. కరాచీ చుట్టు పక్కల గ్యాంగ్స్టర్ల గురించి వచ్చిన కథనాలు జోడించడం ,ముంబాయితో సహా భారతదేశంలో అసాంఘిక తీవ్రవాద శక్తులతో వారి సంబంధాలు బెలూచీలు ఫక్తూన్లకు మధ్యన వివాదాలు, భారత దేశంలో ఉరి వంటి ఘటనలు, చూపిస్తూ మీరు చూస్తున్నది నిజమైన కథ అనే భ్రమ కల్పిస్తాడు దర్శకుడు.
ఆజేయ దర్ తీసిన దురంఢర్ 1- 2025 డిసెంబర్లోనే వచ్చింది. రెండో భాగం వెనువెంటనే విడుదల చేయాల్సినంత హడావుడేమీ లేదు. కానీ ఆ వేడీ చల్లారనివ్వకూడదు.. ఇప్పుడే వస్తే మొదటి చిత్రం ఎఫెక్ట్ దీనికి తోడవుతుంది. కనుకనే ఆఘమేఘాల మీద దురంధర్ 2 ద రివెంజ్( ప్రతీకారం) విడుదల చేశారని సినీ మేధావులు, రాజకీయ విశ్లేషకులు బహిరంగానే విమర్శలు గుప్పిస్తున్నారు .



