నవతెలంగాణ హైదరాబాద్: భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదా పడింది. ఈ విషయాన్ని తాజాగా పలాశ్ సోదరి, సింగర్ పలాక్ ముచ్చల్ ఇన్స్టా వేదికగా ఓ స్టోరీ షేర్ చేశారు. దానిలో ఇరు కుటుంబాల గోప్యతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
‘మంధాన తండ్రి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన్ను సాంగ్లీలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మంధాన స్పష్టంగా చెప్పింది. అందుకే వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది’ అని మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందటే మంధాన వివాహ వేడుకలు మొదలయ్యాయి. మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత మహిళా క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, షెఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ పాల్గొని సందడి చేశారు.
ఆదివారం రాత్రి పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీ వల్ల అతడు ఇబ్బంది పడ్డాడని వైద్యులు వెల్లడించారు. చికిత్స అనంతరం పలాశ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు సమాచారం. అయితే ఈ విషయానికి సంబంధించి పలాశ్ సోదరి పలాక్ ముచ్చల్ ఇన్స్టా వేదికగా స్టోరీ షేర్ చేశారు.



