Saturday, July 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంముస్లింలే బీజేపీ టార్గెట్‌

ముస్లింలే బీజేపీ టార్గెట్‌

- Advertisement -

– స్థానికత పేరుతో చట్టవిరుద్ధ బహిష్కరణలు
– ఓటు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యం
-బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే బలవంతపు తరలింపులు
– యూఎస్‌ సంస్థ హెచ్‌ఆర్‌డబ్ల్యూ ఆందోళన
న్యూయార్క్‌ :
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో గల ఎన్డీఏ సర్కారు అవలంభిస్తున్న విద్వేషపూరిత రాజకీయాలపై పలు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. అమెరికాలోని న్యూయార్క్‌ కేంద్రంగా పని చేసే ప్రభుత్వేతర సంస్థ హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ (హెచ్‌ఆర్‌డబ్ల్యూ) కూడా బీజేపీ ప్రభుత్వం తీరుపై ఆందోళనను వ్యక్తం చేసింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం కాషాయ సర్కారు ముస్లింలను టార్గెట్‌ చేసుకుంటున్నదనీ, అక్రమ వలసదారుల పేరుతో వందలాది మంది బెంగాలీ ముస్లింలను బంగ్లాదేశ్‌కు బలవంతంగా పంపుతోందని ఆరోపించి ంది. భారత పౌరులతో పాటు బెంగాలీ ముస్లింలను దేశం నుంచి ఏకపక్షంగా బహిష్కరించటం ద్వారా వివక్షను పెంచుతోందని హెచ్‌ఆర్‌డబ్ల్యూ ఆసియా డైరెక్టర్‌ ఎలైన్‌ పియర్సన్‌ అన్నారు. హెచ్‌ఆర్‌డబ్ల్యూ.. ప్రధానంగా మానవ హక్కులపై పని చేస్తుంది. దీనిపై పరిశోధనలూ జరుపుతుంది. భారత్‌లో నెలకొన్న పరిస్థితులపై హెచ్‌ఆర్‌డబ్ల్యూ ఆందోళనను వెలిబుచ్చింది. భారత అధికారులు ప్రజలను చట్టవిరుద్ధంగా బహిష్కరించటాన్ని ఆపాలని డిమాండ్‌ చేసింది. బహిష్కరణకు గురైనవారిలో చాలా మంది బంగ్లాదేశ్‌ సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చిన భారతీయ పౌరులు అని హెచ్‌ఆర్‌డబ్ల్యూ తెలిపింది. మే 7 నుంచి జూన్‌ 15 మధ్య కనీసం 1500 మంది ముస్లిం పురుషులు, మహిళలు, పిల్లలను బంగ్లాదేశ్‌కు బహిష్కరించారనీ, వీరిలో మయన్మార్‌ నుంచి వంద మంది రోహింగ్యా శరణార్థులూ ఉన్నారని బోర్డర్‌ గార్డ్‌ బంగ్లాదేశ్‌ రిపోర్ట్‌ను ఉటంకిస్తూ హెచ్‌ఆర్‌డబ్ల్యూ వివరించింది. ఈ విషయంలో మాత్రం భారత్‌ నుంచి ఎలాంటి అధికారిక గణాంకాలూ లేకపోవటం గమనార్హం.
బహిష్కరణకు గురైనవారిలో ఎక్కువ మంది బీజేపీ పాలిత రాష్ట్రాలైన అసోం, యూపీ, మహరాష్ట్ర, గుజరాత్‌, ఒడిశా, రాజస్తాన్‌ల నుంచి వచ్చిన వలస కార్మికులని హెచ్‌ఆర్‌డబ్ల్యూ తెలిపింది. బహిష్కరించే క్రమంలో సరిహద్దుల వద్ద ఉండే గార్డులు అమానుషంగా ప్రవర్తించారనీ, వారిని (బహిష్కరణకు గురైననవారు) కొట్టారని ఆరోపించింది. ఈ క్రమంలో వారి పౌరసత్వం గురించి ధృవీకరించే చర్యలు చేపట్టకుండానే.. బంగ్లాదేశ్‌కు వెళ్లాలంటూ బలవంతం చేశారని హెచ్‌ఆర్‌డబ్ల్యూ వివరించింది. తనతో పాటు మరో 14 మందిని బంగ్లాదేశ్‌కు బలవంతంగా ఎలా తరలించారన్న విషయంపై అసోంకు చెందిన ఖైరుల్‌ ఇస్లాం (51) చెప్పిన విషయాన్ని సదరు మానవ హక్కుల సంస్థ ఉటంకించింది. ”నేను సరిహద్దు దాటి బంగ్లాదేశ్‌లోకి వెళ్లటానికి నిరాకరించాను. దాంతో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) అధికారి నన్ను కొట్టాడు. రబ్బరు బుల్లెట్లను నాలుగుసార్లు గాల్లోకి కాల్చాడు” అని ఖైరుల్‌ ఇస్లాం తెలిపినట్టు వివరించింది. ఖైరుల్‌ ఇస్లాంతో పాటు మరికొంత మందిని మే 26న భారత అధికారులు బంగ్లాదేశ్‌కు బలవంతంగా తరలించారు. ఇక ముంబయిలోని ఒక వలసకార్మికుడి ఇంట్లోకి చొరబడిన పోలీసులు.. ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని హెచ్‌ఆర్‌డబ్ల్యూ తెలిపింది. అంతేకాదు.. ఆయన పౌరసత్వానికి సంబంధించిన గుర్తింపు పత్రాలను చించేశారని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -