Monday, June 16, 2025
E-PAPER
Homeహైదరాబాద్నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి

నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి

- Advertisement -

నవతెలంగాణ-నాగోల్‌
ఎల్బీనగర్‌ నియోజకవర్గ అభివద్ధి కోసం తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎల్బీనగర్‌ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి హామీ ఇచ్చారు. నాగోల్‌ డివిజన్‌ పరిధిలోని శ్రీ సాయి నగర్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ భవనంలో డివిజన్‌లోని పలు కాలనీలా సంక్షేమ సంఘాల సమావేశాలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కాలనీ అసోసియేషన్‌ సభ్యులు పలు సమస్యలను సుధీర్‌ రెడ్డికి విన్నపించారు. కొన్ని కాలనీల నందు డ్రయినేజీ ఓవర్‌ ఫ్లో కావడం వల్ల డ్రయినేజీలు పొంగిపొర్లుతున్నాయని, డ్రయినేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. అలాగే రాత్రిపూట కొన్ని చిల్లర మూకలు రోడ్ల మీద గంజాయి సేవిస్తూ రోడ్డు మీద పోయే వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. లక్కీ రెస్టారెంట్‌ వద్ద అక్రమ పార్కింగ్స్‌ పెట్టి కాలనీలోకి రాకుండా ఇబ్బందుల గురిచేస్తున్నారుని తెలిపారు. సాయి నగర్‌ కాలనీ అసోసియేషన్‌ భవనంలో నీటి కొరత ఉన్నదని, ఒక బోరు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు. రాత్రిపూట పోలీసు బందోబస్తు పెంచాలని కోరారు. రాబోయే వర్షాకాలంలో విద్యుత్‌ సమస్యలు నెలకొంటాయని వాటిని అధిగమిస్తూ కొన్ని కాలనీలలో విద్యుత్‌ స్తంభాలు, ఒరిగిపోయిన వాటిని సరిచేయాలని కోరారు. 10 నూతన స్తంభాలు మంజూరు చేయాలని కోరారు. పెరిగిన జనాభా నేపథ్యంలో గతంలో వేసిన మంచినీటి పైప్లైన్‌ స్థానంలో నూతన పైప్లైన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. కొన్ని కాలనీల యందు రోడ్ల మీద వ్యాపారం చేస్తుండడం వలన తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉన్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం..
నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తప్పకుండా ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే స్థానిక పోలీస్‌ అధికారులకు సమాచారం ఇచ్చి కాలనీల యందు గస్తీ పెంచుతామని తెలిపారు. ట్రాఫిక్‌ విషయంలో అధికారులను పిలిపించి.. తగు పరిష్కారం చూపిస్తామని అన్నారు. నూతన డ్రైన్స్‌, తాగునీటి వ్యవస్థను మెరుగుపరచడం జరుగుతుందన్నారు. విద్యుత్‌ సమస్యలు లేకుండా చూస్తూ నూతన స్తంభాలను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గ అభివద్ధి కోసం నా వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు ఆనంతుల రాజారెడ్డి, డివిజన్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు తూర్పాటి.చిరంజీవి, సీనియర్‌ నాయకులు గవ్వ శ్యామ్‌ సుందర్‌ రెడ్డి, కాలనీవాసులు యుగంధర్‌ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, వెంకట రెడ్డి, వి.రవీందర్‌ రెడ్డి, శ్రీనివాసాచార్యులు, గోపాల్‌ రావు, శ్రీనివాసరావు, సుధీర్‌ రెడ్డి, బీమిడి వెంకట్‌ రెడ్డి, కర్రీ సూర్య ప్రకాష్‌, అరవింద్‌ రెడ్డి, నాగేంద్ర ప్రసాద్‌, అశోక్‌ కుమార్‌, శ్రీనివాస్‌ రావు, వినోద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -