Wednesday, June 18, 2025
E-PAPER
Homeజాతీయంపాలస్తీనాకు దేశవ్యాప్తంగా సంఘీభావం

పాలస్తీనాకు దేశవ్యాప్తంగా సంఘీభావం

- Advertisement -

– ఇజ్రాయిల్‌తో మోడీ ప్రభుత్వం అన్ని రకాల సైనిక సహకారాన్ని వెంటనే నిలిపివేయాలి
– ఈ క్రూరమైన దురాక్రమణపై కేంద్రం మౌనం : ఎంఎ బేబీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పాలస్తీనాకు దేశవ్యాప్తంగా సంఘీభావం లభించింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇజ్రాయిల్‌ దురా క్రమణపై ప్రజలు గొంతెత్తారు. పాలస్తీనాలో చిన్నారులు, మహిళలపై ఇజ్రాయిల్‌ చేస్తున్న అమానవీయ చర్యలను ఖండించారు. ఇజ్రాయిల్‌ క్రూరమైన దాడులపై మోడీ ప్రభుత్వం మౌనం వీడాలని, బాధిత పాలస్తీనా పట్ల మానవీయతను ప్రదర్శించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌), ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, సీజీపీఐ తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పాలస్తీనా సంఘీభావ కార్యక్రమాలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో వామపక్షాల ఆధ్వర్యంలో పాలస్తీనాకు సంఘీభావంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లెఫ్ట్‌ఫ్రంట్‌ చైర్మెన్‌ బిమన్‌ బసు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం తదితర వామపక్ష నేతలు పాల్గొన్నారు. త్రిపుర రాజధాని అగర్తలాలో ”యుద్ద వద్దు, శాంతి కావాలి” అంటూ భారీ ప్రదర్శన చేపట్టారు. రాజస్థాన్‌లోని జైపూర్‌తో పాటు వివిధ జిల్లాల్లో నిరసనలు జరిగాయి. ఒడిశాలోని భువనేశ్వర్‌తో పాటు వివిధ జిల్లాల్లో సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌), ఫార్వర్డ్‌ బ్లాక్‌ ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. బీహార్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో వామపక్షాలు మానవహారం నిర్వహించాయి. పంజాబ్‌లో సీపీఐ(ఎం) నేతలు, కార్యకర్తలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు జరిగాయి. జమ్మూకాశ్మీర్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో కేంద్ర కమిటీ సభ్యులు యూసఫ్‌ తరిగామి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వివిధ ప్రాంతాల్లో పాలస్తీనా సంఘీభావ కార్యక్రమాలు జరిగాయి.
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారీ సంఘీభావ సభ జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ మాట్లాడుతూ ఇజ్రాయిల్‌ను ఒక మోసపూరిత రాజ్యంగా పేర్కొన్నారు. దాని అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతు పొందిన ఉగ్రవాది అని ధ్వజమెత్తారు. ఇటీవల పహల్గాం (కాశ్మీర్‌)లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రవాద దాడికి, ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ చేసిన అకారణ దాడికి మధ్య ఏదైనా తేడా ఉందా? అని ప్రశ్నించారు. రెండూ హింస, విధ్వంసం వ్యాప్తి చేసే అమానవీయ, అకారణ ఉగ్రవాద చర్యలేనని స్పష్టం చేశారు. ఇజ్రాయిల్‌ క్రూరమైన దురాక్రమణ చర్యలపై మోడీ ప్రభుత్వం మౌనంగా ఉందనీ, ఇది భారతదేశ మానవత్వపు వారసత్వానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌, ఇజ్రాయిల్‌ మధ్య కుమ్మక్కును ఎంఎ బేబీ బయటపెట్టారు.
హైదరాబాద్‌లో తయారు చేయబడిన డ్రోన్‌లను ఇజ్రాయిల్‌కు సరఫరా చేస్తున్నారనీ, వీటిని పాలస్తీనా, ఇరాన్‌లోని అమాయక ప్రజలపై ఉపయోగిస్తారని ధ్వజమెత్తారు. అటువంటి సైనిక సరఫరాలను వెంటనే నిలిపివేయాలని మోడీ ప్రభుత్వాన్ని ఎంఎ బేబీ కోరారు. పాలస్తీనా సమస్యను పరిష్కరించడానికి ఒకప్పుడు ఆధారమైన రెండు దేశాల పరిష్కారం పాలసీ ఇప్పుడు కూలిపోతోందని ఆయన అన్నారు. ”పాలస్తీనా అరబ్బులకు చెందినది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతరులు భారతదేశంలో కలిసి నివసిస్తున్నట్టే యూదులు, క్రైస్తవులు అక్కడ శాంతియుతంగా జీవించాలి” అని మహాత్మా గాంధీ చెప్పిన మాటలను బేబీ ఉటంకించారు. దీనికి విరుద్ధంగా, నేడు జియోనిస్టులు పాలస్తీనా పిల్లలను కాల్చివేస్తున్నారని, వారిని భవిష్యత్‌ ఉగ్రవాదులుగా ప్రకటిస్తున్నారని విమర్శించారు.
పాలస్తీనా ప్రజల పోరాటాం ఇస్లామిక్‌ యుద్ధం కాదనీ, బ్రిటీష్‌ వలసవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి సమానమైన నిజమైన జాతీయ విముక్తి ఉద్యమమని బేబీ స్పష్టం చేశారు.
”పాలస్తీనా సంఘీభావ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనంగా ఉండటం సిగ్గుచేటు. అటువంటి దాడులను నిర్వహించడంతో అరబ్‌ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించడానికి అమెరికా సామ్రాజ్యవాదం నిరంతరం ఇజ్రాయిల్‌ను ఉపయోగిస్తోంది. ఇజ్రాయిల్‌ దురాక్రమణను వెంటనే ఆపాలి. పాలస్తీనాను స్వతంత్ర, సార్వభౌమదేశంగా గుర్తించాలి.
భారతదేశం లోని వామపక్ష పార్టీలు నిర్ద్వంద్వంగా డిమాండ్‌ చేస్తున్నాయి. పాలస్తీనా ప్రజల జాతీయ విముక్తి పోరాటానికి తన పూర్తి సంఘీభావాన్ని సీపీఐ(ఎం) పునరుద్ఘాటిస్తుంది. భారత ప్రభుత్వం ఇజ్రాయిల్‌తో అన్ని రకాల సైనిక సహకారాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తుంది” అని పేర్కొన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ. రాజా, సీపీఐ(ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, సీజీపీఐ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఆర్‌ఎస్‌పీ నాయకులు సభలో ప్రసంగించి, పాలస్తీనా ప్రజల న్యాయమైన పోరాటానికి తమ మద్దతును ప్రకటించారు. పాలస్తీనా ప్రజలకు తమ దృఢ సంఘీభావాన్ని ప్రకటించారు.ఈ నిరసనలో విద్యార్థులు, యువత, మేధావులు, రచయితలు, కళాకారులతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -