Tuesday, November 25, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఫిబ్రవరి వరకు సమయం కావాలి

ఫిబ్రవరి వరకు సమయం కావాలి

- Advertisement -

– మావోయిస్టు పార్టీ ఎంఎంసీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ ప్రతినిధి అనంత్‌
…మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ
నవతెలంగాణ-చర్ల

తమకు ఫిబ్రవరి వరకు సమయం కావాలని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలను మావోయిస్టు పార్టీ ఎంఎంసీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ ప్రతినిధి అనంత్‌ సోమవారం ఒక లేఖ ద్వారా కోరారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, చత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయి, హౌం మంత్రి విజరు శర్మ, మధ్య ప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌కు లేఖలు రాశారు. ఈ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ప్రపంచంలో, దేశంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత, ఆయుధాలను వదిలివేయడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికం గా నిలిపివేయాలని తమ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని తెలిపారు. సీసీఎం సతీష్‌ దాదా తర్వాత, మరొక సీసీఎం చంద్రన్న కూడా ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చా రని అన్నారు. తాము, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ ప్రత్యేక జోనల్‌ కమిటీ లు కూడా ఆయుధాలను విడిచిపెట్టి, ఆయా ప్రభుత్వాల పునరావాస ప్రణాళికను అంగీకరించాలనుకుంటున్నామని తెలిపారు. తమ పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉంటుందని, తాము సమిష్టిగా ఈ నిర్ణయానికి రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. కాబట్టి ఫిబ్రవరి 15, 2026 వరకూ సమయం ఇవ్వాలని మూడు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నామని అన్నారు. అప్పటి వరకు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించి, వారి భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని తాము కోరుతున్నామని తెలిపారు. రాబోయే పీఎల్‌జీఏ వారోత్సవాల్లో తాము ఎటువంటి కార్యకలాపాలను కూడా నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు అనంత్‌ లేఖలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -