Thursday, May 22, 2025
Homeజాతీయంప్రొ.అలీఖాన్‌ మహ్ముదాబాద్ వ్య‌వ‌హారంపై NHRC కీల‌క నిర్ణ‌యం

ప్రొ.అలీఖాన్‌ మహ్ముదాబాద్ వ్య‌వ‌హారంపై NHRC కీల‌క నిర్ణ‌యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్: అశోకా యూనివ‌ర్సిటీ ప్రొపెస‌ర్ అలీఖాన్‌ మహ్ముదాబాద్ వ్య‌వ‌హారంపై జాతీయ మావ‌న హ‌క్కుల సంఘం(NHRC) స్పందించింది. మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల ఆధారంగా సుమాటో గా కేసు స్వీక‌రిస్తున్నట్లు వెల్ల‌డించింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను వారంలోగా త‌మ‌కు అంద‌జేయాల‌ని హ‌ర్యానా డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. మావ‌న హ‌క్కుల ఉల్లంఘ‌న‌తో పాటు భావ‌ప్ర‌క‌ట‌నలో హ‌ద్దులు దాటార‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.కొన్ని గంట‌ల ముందే ప్రొఫెసర్‌ అలీఖాన్‌ మహ్ముదాబాద్‌కి సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఆప‌రేష‌న్ సిందూర్ సంబంధించి అలీఖాన్‌ ఆన్‌లైన్‌లో ఎలాంటి పోస్టులు చేయకూడదని ఆదేశించింది.

ఆపరేషన్‌ సిందూర్‌’పై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిన అశోకా యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అలీఖాన్‌ మహ్మూదాబాద్‌ను హర్యానా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. బిజెపి యువ మోర్చా నాయకుడు, జతేరి గ్రామ సర్పంచ్‌ యోగేష్‌ జతేరి, హర్యానా మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేణు భాటియా ఫిర్యాదు మేరకు అలీఖాన్‌ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నామని హర్యానాలోని రాయ్ (సోనిపట్‌) అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎసిపి) రాయ్ అజీత్‌ సింగ్‌ తెలిపారు. ఆయనపై రాయ్ పోలీస్‌ స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని పేర్కొన్నారు. కోర్టులో హాజరు పరిచామని, ఐదు రోజుల రిమాండ్‌ విధించారని తెలిపారు. సోనీపట్‌లోని అశోకా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతిగా అలీఖాన్‌ వ్యవహరిస్తున్నారు.

అలీఖాన్‌ వ్యాఖ్యలు ఇవీ
ఆపరేషన్‌ సిందూర్‌ గురించి మీడియా సమావేశాల్లో వివరించిన కల్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లకు సంబంధించి సోషల్‌ మీడియాలో అలీఖాన్‌ పోస్టు చేశారు. ”సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌లు జరిగింది జరిగినట్టుగా మీడియాకు చెప్పలేదు. కానీ దేశ ప్రజలు కోరుకున్నది చెప్పారు. ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్న వారు క్షేత్రస్థాయిలో జరిగిన నిజాలను మాత్రమే చెప్పాలి. లేదంటే అది వంచనే” అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది. ”సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌లను చూసి మేం గర్విస్తున్నాం. వారికి మా సలాం. వాళ్లపై అలీఖాన్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదు. ఈ తప్పు చేసినందుకు అలీఖాన్‌ ఈ రోజే కమిషన్‌ ఎదుట హాజరై క్షమాపణ చెప్పాలి” అని పేర్కొంటూ ఈ నెల 12న అలీఖాన్‌కు రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేణూ భాటియా నోటీసులు పంపారు.

నా వ్యాఖ్యలను వక్రీకరించారు : అలీఖాన్‌
మహిళా కమిషన్‌ నోటీసులపై వెంటనే స్పందించిన అలీఖాన్‌.. తన వ్యాఖ్యలకు రాష్ట్ర మహిళా కమిషన్‌ వక్రభాష్యం చెప్పిందని పేర్కొన్నారు. తన పోస్ట్‌ మహిళల హక్కులు లేదా చట్టాలకు ఎలా విరుద్ధమో సమన్లలో కమిషన్‌ పేర్కొనలేదని తెలిపారు. ”మహిళా కమిషన్‌ నా వ్యాఖ్యలను తప్పుడు కోణంలో, తప్పుడు ఉద్దేశంతో చదివింది. వాటిని తప్పుగా అర్థం చేసుకుంది. వాటిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. నా మాటల్లోని అర్థాన్ని మార్చేందుకు యత్నించింది” అని పేర్కొంటూ అలీఖాన్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఒక పోస్ట్‌ పెట్టారు. ఇది కొత్త రకమైన సెన్సార్‌ షిప్‌, హెరాస్మెంట్‌ అని, లేని వాటిని సమస్యలుగా చూపించారని పేర్కొన్నారు. తాను భారత సాయుధ దళాలను ప్రశంసించానని, కానీ హింసను విమర్శించానని తెలిపారు. 1200 మంది అకడమీషియన్లు, సామాజిక కార్యకర్తలు ప్రొఫెసర్‌కు మద్దతు తెలుపుతూ బహిరంగ లేఖ విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -