నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ము కాశ్మీర్లో ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) శుక్రవారం ప్రాథమిక నివేదికను సమర్పించింది. పాకిస్తాన్ నివేదిక సంస్థ, ఇంటర్- సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఇటి)ల మధ్య సంబంధం ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీనియర్ ఐఎస్ఐ ఆపరేటివ్లు జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ దాడి ప్రణాళికను పాకిస్తాన్లోని ఎల్ఇటి సంస్థలో అభివృద్ధి చేసినట్లు నివేదిక పేర్కొంది.
దాడికి కీలకంగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు హష్మీముసా అలియాస్ సులేమాన్, అలీభారు అలియాస్ తల్హాబారులు పాకిస్థానీయులను ఎన్ఐఎ నిర్థారించిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు వ్యక్తులు పాకిస్తాన్లోని వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్నారని, సమయం, వ్యూహరచన అమలుపై నిర్దిష్టమైన సూచనలు అందుకున్నారని తేలినట్లు ఎన్ఐఎ పేర్కొంది. దాడికి వారం రోజుల ముందు ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించారని, వారికి స్థానిక వ్యక్తుల గ్రూపు (ఓవర్గ్రౌండ్ వర్కర్క్స్ నెట్వర్క్) ఆశ్రయం కల్పించడంతో పాటు నిఘా, నావిగేషన్, వ్యూహానికి మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు.
ఎన్ఐఎ విస్తృతంగా ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ డేటాను సేకరించింది. దాడి ప్రాంతం నుండి స్వాధీనం చేసుకున్న 40కి పైగా తూటాలను విశ్లేషణ కోసం పంపింది. ఆ ప్రాంతంలో 3డి మ్యాపింగ్ను నిర్వహించారు. లోయ చుట్టూ ఉన్న మొబైల్ టవర్ల నుండి సమాచారాన్ని సేకరించారు. దాడికి ముందు.. ఈ ప్రాంతంలో ఉపగ్రహ ఫోన్ కార్యకలాపాలు పెరిగాయి. బైరసర్, చుట్టుపక్కల సుమారు మూడు ఉపగ్రహ ఫోన్లు పనిచేస్తున్నాయని, రెండింటి నుండి సంకేతాలను గుర్తించి విశ్లేషించినట్లు ఎన్ఐఎ తెలిపింది.
ఎన్ఐఎ, భద్రతా సంస్థలు 2,800 మందికి పైగా వ్యక్తులను విచారించాయి. మే 2 నాటికి 150 మందిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ కోసం కస్టడీలో ఉంచినట్లు తెలిపింది. వీరిలో అనుమానిత ఒజిడబ్ల్యులు మరియు జమాతే ఇస్తామి వంటి నిషేధిత గ్రూపులు మరియు హురియత్ కాన్ఫరెన్స్ లోని వివిధ వర్గాలతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలిపింది.