నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కు రూ.వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో.. డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీని త్వరలోనే భారత్కు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. బ్రిటన్ అధికారులు వచ్చే నెల అంటే నవంబర్ 23న నీరవ్ మోడీని భారత్కు అప్పగించనున్నట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అతన్ని ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంచనున్నట్లు సమాచారం.
పంజాబ్ నేషనల్ బ్యాంక్కు నీరవ్ మోడీదాదాపు రూ.14 వేల కోట్ల రుణం ఎగవేసిన ఉదంతం 2018లో వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే అతను విదేశాలకు పారిపోయాడు. ఈ కేసును సీబీఐ, ఈడీ విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా నీరవ్ ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఆయనపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ.. ఇప్పటిదాకా దేశ, విదేశాల్లోని రూ.2,596 కోట్ల విలువైన నీరవ్ ఆస్తుల్ని అటాచ్ చేసింది. ముంబైలోని బ్రాడీ హౌజ్ పీఎన్బీ శాఖ కేంద్రంగా ఈ కుంభకోణం జరిగింది. బ్యాంక్ ఉన్నతాధికారులతో కలిసి నకిలీ/మోసపూరిత ఎల్వోయూలతో నీరవ్, చోక్సీలు వేల కోట్ల రుణాలను పొందారు. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటిదాకా రూ.1,052.42 కోట్ల సొమ్మును పీఎన్బీ, ఇతర బ్యాంకులకు అప్పజెప్పినట్టు ఈడీ వర్గాలు చెప్తున్నాయి.