నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించి ఎన్నికల సంఘం కమిషన్ నోటిఫికేషన్ను త్వరలో జారీ చేయనుంది. రానున్న ఎన్నికలలో నితిష్ ఓడిపోనున్నారని ఇప్పటికే పలు సర్వేలు కోడైకూస్తున్నాయి. ఈక్రమంలో నితిష్ కుమార్ ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించడానికి ఎన్నికల తాయిలాలను ప్రకటిస్తుంది.
సీఎం నితీశ్ కుమార్అధ్యక్షతన ఇవాళ నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిసైడ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని దివ్యాంగుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ కోసం సిద్ధం అయ్యేందుకు రూ.50 వేలు (బీపీఎస్సీ) రూ.లక్ష (యూపీఎస్సీ) అభ్యర్థులకు ప్రోత్సాహకాలను అందజేసేందుకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా బీహార్ ఫుడ్ సెక్యూరిటీ సంపర్క నియమావళి-2025కి ఓకే చెప్పారు. అంబేడ్కర్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం రూ.65 కోట్ల నిధులు, జీవిక దీదీ బ్యాంక్ కోసం రూ.105 కోట్లు మంజూరే చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.