నవతెలంగాణ – హైదరాబాద్: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు తీసుకున్నారు. ఈరోజు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ పరిణామంతో ఆయన ఇక జాతీయ రాజకీయాలకే పరిమితం కానున్నట్లు స్పష్టమైంది. త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు నితీశ్ స్వయంగా వెల్లడించారు. ఈ ప్రమాణస్వీకారంతో నితీశ్ కుమార్ తన ఖాతాలో ఓ అరుదైన ఘనతను చేర్చుకున్నారు. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి, లోక్సభ, రాజ్యసభ.. ఇలా నాలుగు చట్టసభల్లోనూ సభ్యుడిగా పనిచేసిన కొద్దిమంది నేతల జాబితాలో ఆయన చేరారు.
రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం ఆయన గురువారమే ఢిల్లీకి చేరుకున్నారు. మార్చి 16న రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన నితీశ్, మార్చి 30న తన శాసనమండలి సభ్యత్వానికి (ఎమ్మెల్సీ) రాజీనామా చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఢిల్లీలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. “బిహార్లో చాలా పనులు చేశాను. ఇక ఇక్కడే (ఢిల్లీ) ఉండి సేవ చేయాలని భావిస్తున్నాను. మూడు నాలుగు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తాను. కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యతలు చేపడతారు” అని స్పష్టం చేశారు.



