– పలు దేశాల సూచన
– ఉద్రిక్తతలను నివారించాలని హితవు
– అమెరికా దుశ్చర్యను ఖండించిన రష్యా, చైనా, క్యూబా, వెనిజులా
– సైనిక పరిష్కారం తగదన్న ఐరాస
న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా జరిపిన దాడుల నేపథ్యంలో పలు దేశాలు అగ్ర రాజ్యం దుశ్చర్యను ఖండించాయి. ఈ దాడులతో ప్రాంతీయ ఘర్ష ణలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశాయి. దాడులకు స్వస్తి చెప్పా లని, ఉద్రిక్తతలను నివారించి దౌత్యపరమైన చర్చలు జరపాలని హితవు పలికాయి. అయితే ఇజ్రాయిల్, బ్రిటన్ మాత్రం ట్రంప్ చర్యను సమర్ధించాయి. ట్రంప్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఇజ్రాయిల్ కొని యాడింది. బలప్రయోగం ద్వారా మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరత సాధ్యపడుతుందని ప్రధాని నెత న్యాహూ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ భద్రతకు ఇరాన్ అణు కార్యక్రమం తీవ్ర ముప్పు కలిగిస్తుందని బ్రిటన్ ప్రధాని స్టార్మన్ తెలిపారు. అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకు నేందుకు ఇరాన్ను అనుమతించకూడదని, ముప్పును తప్పించేందుకే అమెరికా ఈ చర్యకు దిగిందని అన్నారు. కాగా అమెరికా చర్యపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్టెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఘర్షణలు అదుపు తప్పే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు, మధ్యప్రాచ్యం, ప్రపంచం కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్రిక్తతలను నివారించేందుకు సభ్య దేశాలు కృషి చేయాలి. సైనిక పరిష్కారం కూడదు. దౌత్యం ద్వారానే ముందుకు సాగాలి’ అని సూచించారు.
ఘర్షణల ముప్పు పెరుగుతుంది : రష్యా
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఈ దాడులతో మధ్యప్రాచ్యంలో ఘర్షణల ముప్పు పెరుగుతుందని తెలిపింది. ఇరాన్ను లక్ష్యంగా చేసుకోవాలన్న అమెరికా బాధ్యతారాహిత్య నిర్ణయం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని రష్యా విదేశాంగ శాఖ ధ్వజమెత్తింది. దుందుడుకు చర్యలకు స్వస్తి చెప్పి రాజకీయ,దౌత్య చర్యలు చేపట్టాలని కోరింది. ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా జరిపిన దాడులకు సంబంధించి డోనాల్డ్ ట్రంప్తో చర్చించాలని పుతిన్ కోరుకోవడం లేదని రష్యా స్పష్టం చేసింది. కాగా అన్ని పక్షాలు చర్చలకు రావాలని న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ కోరారు. ట్రంప్ చర్యలను న్యూజిలాండ్ సమర్ధిస్తుందా అని ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. ఇప్పటి వరకూ తాను ఇలాంటి సంక్షోభాన్ని చూడలేదని అన్నారు. సైనిక చర్య కంటే దౌత్యమే మేలని చెప్పారు.
దౌత్య కార్యాలయాన్ని మూసేసిన ఆస్ట్రేలియా
జపాన్ ప్రధాని షిగేరు ఇస్హిబా తన క్యాబినెట్ సహచరులతో సమావేశమై అమెరికా దాడుల ప్రభావంపై చర్చించారు. జపాన్లో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన యొమియురి పత్రిక అదనపు ప్రతులను ముద్రించి రాజధాని టోక్యోలో పంపిణీ చేసింది. అమెరికా దాడుల కారణంగా భద్రత, ఆర్థిక పరంగా ఎదురయ్యే పరిణామాలపై చర్చించేందుకు దక్షిణ కొరియా అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. కాగా టెహ్రాన్లోని తన దౌత్య కార్యాలయాన్ని ఆస్ట్రేలియా మూసివేసింది. సిబ్బందికి అక్కడి నుండి ఖాళీ చేయించింది. ఘర్షణకు దౌత్యపరమైన పరిష్కారం సాధించాలని సూచించింది. ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు ముప్పు కలిగిస్తుందని అంటూ ఉద్రిక్తతలను తగ్గించుకొని దౌత్యం, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు సూచించింది. ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలు తక్షణమే దౌత్య చర్చలు ప్రారంభించాలని మెక్సికో కోరింది.
శత్రుత్వానికి స్వస్తి చెప్పండి : వెనిజులా, క్యూబా
కాగా అమెరికా సైనిక చర్యను వెనిజులా ఖండించింది. శతృత్వానికి వెంటనే స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చింది. మరోవైపు క్యూబా కూడా అమెరికా దుందు డుకు దాడులను తప్పుపట్టింది. ఈ దాడులతో మధ్యప్రాచ్యంలో ఘర్షణలు ప్రమాదకరంగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా చర్య ఐరాస ఛార్టర్ను, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, మానవతను సంక్షో భంలోకి నెట్టి తీవ్ర పరిణామాలను కలిగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అణు వివాదానికి చర్చలే పరిష్కారం
ఇరాన్లో ఉద్రిక్తతలు పెరగడంపై ఈజిప్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. అవి మధ్యప్రాచ్యంలో తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని తెలిపింది. ఆ ప్రాంతంలో మరింత గందరగోళ, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. సంయమనం పాటించాలని, ఇరు పక్షాలు చర్చలు జరపాలని ఫ్రాన్స్ కోరింది. అమెరికా దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని, అస్థిర పరిస్థితులు ఏర్పడతాయని తుర్కియే తెలిపింది. అన్ని పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి దాడులకు వెంటనే స్వస్తి చెప్పాలని కోరింది. ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న అణు వివాదాన్ని చర్చలే పరిష్కరిస్తాయని అభిప్రాయపడింది.
చర్చలతోనే పరిష్కారం : చైనా
అమెరికా దాడులు ప్రమాదకరమైన మలుపు తీసుకున్నాయని చైనా వ్యాఖ్యానించింది. మధ్యప్రాచ్యంలో సైనిక జోక్యాలు అనుకోని పరిణామాలకు దారితీస్తాయని గత అనుభవాలు చెబుతున్నాయని, వీటివల్ల ఘర్షణలు దీర్ఘకాలం కొనసాగి ప్రాంతీయ అస్థిరతను సృష్టిస్తాయని చైనా ప్రభుత్వ విదేశీ భాషా ప్రసార విభాగం సీజీటీఎన్ వివరించింది. 2003లో ఇరాక్పై అమెరికా జరిపిన దురాక్రమణను ప్రస్తావించింది. సైనిక ఘర్షణ కంటే దౌత్య చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా మధ్య ప్రాచ్యంలో సుస్థిరత ఏర్పడుతుందని తెలిపింది.