నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధంతో ఎయిరిండియా ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంది. గల్ఫ్ మీదుగా వెళ్లే విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు చేసింది. ఖతార్లోని అమెరికా ఎయిర్బేస్పై ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గల్ఫ్ మీదుగా వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. యూరప్, ఉత్తర అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాలకు సర్వీసులను ఎయిర్ ఇండియా నిలిపివేసింది.
మరోవైపు, ఖతార్లోని భారతీయులు ఇళ్లలోనే ఉండాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. ఖతార్ అధికారుల మార్గదర్శకాలను పాటించాలని భారత్ తెలిపింది. ఇరాన్ దాడులను తిప్పికొట్టినట్లు ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గబోమని ఖతార్ స్పష్టం చేసింది.
అదే విధంగా ఇరాన్ దేశంపై ఇజ్రాయిల్ తోపాటు అమెరికా కూడా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ లోని నతాంత్, ఫోర్డు, ఇస్పహన్ అణు స్థావరాలపై అమెరికా బీ2 బాంబులతో భీకర దాడులు చేసింది. దీంతో ఆ దాడుల ధాటికి ఆ మూడు అణు స్థావరాల్లో పలు కీలక భాగాలు దెబ్బతిన్నాయి. అమెరికా దాడులు చేసిన మరుసటి రోజే ఇజ్రాయిల్ కూడా ఆ మూడు అణు కేంద్రాలపై క్షిపణుల వర్షం కురిపించింది.
మరోవైపు ఇరాన్ కూడా యూఎస్, ఇజ్రాయిల్ దాడులకు ప్రతీకారంగా ఆయా దేశాల కీలక స్థావరాలపై కూడా మధ్యంతర క్షిపణులతో భీకర దాడులు చేసింది. పశ్చిమాసియాలోని పలు దేశాల్లో నెలకొ్ల్పిన యూఎస్ ఎయిర్ బేస్లపై ఇరాన్ వాయుసేనలు బాంబులతో విధ్వంసం సృష్టించాయి. ఖతార్, బహ్రెయిన్, కువైట్ తదితర దేశాల్లో అమెరికా నావిక స్థావరాలపై ఇరాన్ ఫైటర్ జెట్లు భీకర దాడులు చేశాయి. దీంతో దాడుల్లో యూఎస్ ఎయిర్ బేస్లకు భారీ నష్టం వాటిల్లింది.