నవతెలంగాణ – హైదరాబాద్: కొత్త పార్టీపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొత్త పార్టీ పెట్టే ముందు గతంలో కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని గుర్తు చేశారు. ప్రస్తుతం తాను అదే పని చేస్తున్నానని.. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన అసలే లేదని స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నన్ను సంప్రదించలేదు.
సీఎం ఎందుకలా అంటున్నారో తెలియదు.. భయపడుతున్నారేమో? కాళేశ్వరం అంశంలో తప్ప హరీశ్రావుపై నాకు వేరే కోపం లేదు. ఇరిగేషన్పై 2016లోనే కేటీఆర్కు సూచించాను. నేరుగా సీఎంకే ఫైళ్లు వెళ్తున్నాయని కేటీఆర్కు చెప్పా. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే అన్నీ అర్థమవుతాయి. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంకా ఆలోచించలేదు. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందే.
సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైంది. ఆల్మట్టిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ప్రభుత్వం వెళ్లకుంటే జాగృతి తరఫున మేము సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మహారాష్ట్ర ఇప్పటికే స్పందించి కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించింది. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఏమీ ఉండదు. పదేళ్లలో ఆర్డీఎస్, తుమ్మిళ్ల, పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేసుకోలేకపోయాం. సీఎం రేవంత్రెడ్డి కూడా కృష్ణా ట్రైబ్యునల్ విచారణకు వెళ్లాలి. బీఆర్ఎస్ పార్టీ హరీశ్రావు, సంతోష్ సోషల్మీడియాలు నాపైనే దాడి చేస్తున్నాయి. నాపై దాడిని ప్రజలు గమనిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నిరసనలు తెలుపుతాం. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా.. ఆమోదించాలని మండలి ఛైర్మన్ను కోరా. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిది. కొత్త పార్టీలు వస్తే స్వాగతిస్తాం.