10 ఏండ్ల పాలనలో మీరేం చేశారో చెప్పగలరా?
గత ప్రభుత్వంలో వేములవాడకి నిధులు ప్రకటించి… ఒక్క పైసా కూడా ఇవ్వలేదు?
మీ వల్లే కోడెలకు నేడు ఈ దుస్థితి… కోడెల మృతిపై మేము వెంటనే స్పందించాం
ఆ ఘటనపై చర్యలు తీసుకున్నాం… అయినా, బురద రాజకీయం సరికాదు
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ హైదరాబాద్:
రాజన్న కోడెలపై రాజకీయమొద్దని.. గడిచిన 10 ఏండ్లలో వేములవాడ టెంపుల్కు ఏం చేశారో చెప్పగలరా? అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేములవాడ టెంపుల్కి కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆమె నిలదీశారు. హామీ ఇచ్చిన నిధులు కేటాయించకపోవడం వల్లనే వేములవాడలో రాజన్న కోడెలకు ఈ దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఈ కోడెల దుస్థితికి పాపం కేసీఆర్ పాలనదేనని అన్నారు. అయితే, కోడెల ఘటన జరిగిన వెంటనే తమ ప్రభుత్వం స్పందించిందని అన్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోని ముందుకు వెళుతున్నట్టు చెప్పారు. అయినా, ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో బురద రాజకీయం చేయడం సరికాదన్నారు. శుక్రవారం ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తమ హయాంలో సక్సెస్ ఫుల్గా సరస్వతీ పుష్కరాలు నిర్వహించామన్నారు. పుష్కరాలకు 30 లక్షల మంది భక్తులు వచ్చినా ఎక్కడా చిన్న ఇబ్బంది జరగకుండా నిర్వహించామన్నారు. ఇక భద్రకాళి టెంపుల్ విస్తరణ పనులు కోట్లాది రూపాయలతో చేపట్టామన్నారు.
యాదగిరిగుట్ట మీద కేసీఆర్ బొమ్మలను చెక్కించుకున్న వాళ్ళకి అసలు దేవుళ్ళ విషయంలో మాట్లాడే అర్హత ఉందా? అని సురేఖ ప్రశ్నించారు. యాదగిరిగుట్టకి తాము రూ. 63 కేజీల బంగారంతో గోపురం తాపడం చేయించామన్నారు. సామూహిక కోటి దిపోత్సవం, పలు నదీ హారతి కార్యక్రమాలు, కాళేశ్వరం, యాదగిరిగుట్టలకు మహా కుంభాభిషేకం చేశామన్నారు. అసలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఏనాడైనా చేశారా? దేవాదాయ శాఖలో డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగిందా అంటూ నిలదీశారు. కాగా, ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ నాయకుల మాటలు, స్పందనలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అవి చూస్తే తనకు ఒకటే గుర్తుకు వస్తుందని అన్నారు. “పాము శివుడిపై ఒట్టేసిందట ఇంకెవరిని కాటు వేసి చంపనని.. ఒక రాబంధు మాట ఇచ్చిందట… ఇంకెప్పుడూ చచ్చిన పశువులను పీక్కు తిననని.. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిదట… తోటి జంతువులను సంహారించనని.. ఈ కట్టుకథలు…. కల్వకుంట్ల కుట్రలను మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు వినాలా? విని నమ్మాలా? అంటూ మంత్రి సురేఖ ప్రశ్నించారు.
‘గత పదేండ్ల పాటు రాష్ట్ర సంపదను ఇష్టారీతిన దోచుకున్న కల్వకుంట్ల దండుపాళ్యం బ్యాచ్ నేడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంటే… విషపురుగులై… విషసర్పాలై… రాబంధులై… ఉద్వేగం పేరుతో మనల్ని ఉన్మాదులను చేసే కుట్రకు పాల్పడుతుండటం బాధాకరమన్నారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత గొడవలతో బీఆర్ఎస్ నాయకులకు ఏం మాట్లాడాలో.. ఏ విధంగా స్పందించాలో అర్థం కావడం లేదన్నారు. వేములవాడలో గోశాలకు ఈ దుస్థితికి రావడానికి కారణం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా అని బీఆర్ఎస్ నేతలు ఆత్మ సమీక్ష చేసుకోవాలన్నారు. వేములవాడ రాజన్న దగ్గర మొక్కులు మొక్కి రూ.100 కోట్లు ఇస్తానని దేవుడిని మోసం చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్ది కాదా? అని ఆమె ప్రశ్నించారు. అప్పుడు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు వేములవాడకు వంద కోట్లు ఖర్చు పెడితే గోశాల కూడా బాగుపడేది కదా సురేఖ చెప్పుకొచ్చారు. కోడెల మొక్కులు, కోడెలు సమర్పించుకోవటం భక్తుల నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిందన్నారు. వాటిని కూడా రాజకీయం చేయటం బీఆర్ఎస్ పార్టీ నీచ రాజకీయానికి, ఆ పార్టీ నాయకుల నీచ మనస్తత్వానికి నిలువెత్తు నిదర్శనమన్నారు.
కేసీఆర్ పదేండ్ల అరిష్టపు పాలన ఇప్పటికీ వేములవాడను వెంటాడుతోందన్నారు. ఆ పాపం బీఆర్ఎస్ పార్టీని కూడా వెంటాడుతుందని… అందుకే ఆ పార్టీలో లుకలుకలు తెరపైకి వస్తున్నాయన్నారు. తమ నాయకు రేవంత్ రెడ్డి అన్న సీఎం అయ్యాక వేములవాడకు మాస్టర్ ప్లాన్ ఆమోదించుకున్నామని, వేములవాడ అభివృద్ధికి నిధులు ఇచ్చామన్నారు. రాజన్న టెంపుల్ విస్తరించేందుకు వేగంగా చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. ఒక్కో నెలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో కోడెలను సమర్పిస్తారని, ఇది అక్కడ అందరికీ తెలిసిందేనని, కొన్నిసార్లు అనారోగ్యంతో ఉన్న కోడెలను భక్తులు ఆలయం వద్ద వదిలేసి వెళుతారని… వాటిని కూడా సంరక్షించిన బాధ్యత ఆలయంపై ఉంటుందని అన్నారు. ఆ క్రమంలో జరిగిన పరిణామాలపై రాద్ధాంతం, రాజకీయం చేయడం శోచనీయమని మంత్రి పేర్కొన్నారు. గోశాలలో కోడెలకు స్థలం చాలని పరిస్థితి వచ్చిందని మంత్రి గుర్తు చేశారు. కోడెలు జబ్బు పడ్డప్పుడు, వాటి సంరక్షణకు 12 మందితో పశువైద్య అధికారుల బృందాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ప్రతి రోజూ సరిపడేంత పచ్చి గడ్డి అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గోవులను కాపాడాలని, గోశాలలను అభివృద్ది చేయాలని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని గుర్తు చేశారు.
గత పదేండ్లలో ఎప్పుడైనా బీఆర్ఎస్ ప్రభుత్వం గోశాల మీద సమావేశం పెట్టిందో లేదో ఫాంహౌసులో పడుకున్న కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పాలని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో ఎన్కేపల్లిలో గోశాల ఏర్పాటు చేయాలని ఇటీవలే అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారన్నారు. వేములవాడలో కూడా సువిశాలమైన గోశాల ఏర్పాటు చేద్దామని, అందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి తమకు సూచించారన్నారు. తమ అధికారులు, తామంతా అదే పని మీద ఉన్నారన్నారు. తమ ప్రజా ప్రభుత్వాన్ని నిందించే ముందు బీఆర్ఎస్ పదేండ్ల దుర్మార్గాన్ని, దయ్యాల పాలనపై ఆత్మ విమర్శ చేసుకోవాలని… భక్తుల విశ్వాసాలు, దేవుళ్లపై రాజకీయ కుట్రలు మానుకోవాలన్నారు. ఎములాడ రాజన్న విషయంలో గానీ…. కోడెల విషయంలో గానీ… తమ ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. ఘటనపై స్థానిక కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను వెంటనే ఘటనాస్థలికి వెళ్ళి పరిశీలించేందుకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. తీసుకోవాల్సిన చర్యల నిమిత్తం ప్రభుత్వానికి ఆయన నివేదించగా… తాము కోడెల రక్షణకి చర్యలు సైతం తీసుకున్నామన్నారు.